Site icon NTV Telugu

Varanasi Update: అన్నపూర్ణ స్టూడియోస్‌లో హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ.. ‘వారణాసి’ కోసం 25 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్‌!

Annapurna Studios Varanasi

Annapurna Studios Varanasi

Varanasi Movie Shooting Update: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి భారతీయ సినిమా ప్రమాణాలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని రాజమౌళి వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇటీవల ప్రారంభించిన ఏ అండ్ ఎం మోషన్ కాప్చర్ సదుపాయాన్ని వారణాసి చిత్రానికి ఉపయోగించడం ప్రత్యేకంగా నిలిచింది.

హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ:
భారతదేశపు అత్యంత అధునాతన, అతిపెద్ద మోషన్ అండ్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ ల్యాబ్‌ను టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రారంభించగా.. ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డకు చెందిన మిహిరా విజువల్ ల్యాబ్స్, అంతర్జాతీయ సంస్థ యానిమాట్రిక్ కలిసి అభివృద్ధి చేశాయి. ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా 360 డిగ్రీల ప్రీ-విజువలైజేషన్, రియల్ టైమ్ వర్చువల్ ప్రొడక్షన్, డిజిటల్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

25 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్‌:
ఈ టెక్నాలజీ సహాయంతో వారణాసి సినిమా కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. సుమారు 25 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తిగా ఈ మోషన్ క్యాప్చర్ ఫెసిలిటీతో షూట్ చేసినట్లు సమాచారం. దీంతో షూటింగ్ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా.. భారీగా ఖర్చులు కూడా తగ్గనున్నాయి. అదే సమయంలో హాలీవుడ్ స్థాయి విజువల్స్‌ను అందించడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో మహేష్ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని ఇండస్ట్రీ టాక్.

గేమ్‌చేంజర్‌గా రాజమౌళి:
ఎస్ఎస్ రాజమౌళి తన ప్రతి చిత్రంలోనూ కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతూ.. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి తన స్టైల్‌కు తగ్గట్టుగా వారణాసి చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జార్జియాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన చిత్ర బృందం.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేసింది.ప్రియాంక ప్రస్తుతం షూటింగ్ నుంచి స్వల్ప విరామం తీసుకున్నట్లు సమాచారం. ఆమె మళ్లీ త్వరలో షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం. మొత్తం షూటింగ్‌ను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వారణాసి ప్రాజెక్ట్‌తో రాజమౌళి మరోసారి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో గేమ్‌చేంజర్‌గా నిలుస్తున్నారు.

 

Exit mobile version