Sandeep Reddy Vanga: హైదరాబాద్లో జరిగిన ‘ఎపిక్’ ఫస్ట్ సెమిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఆనంద్ సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ సమయంలో తాము ఫస్ట్ టైం అమెరికా వెళ్లిన సందర్భాన్ని సందీప్ రెడ్డి వంగా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అమెరికాలో మా అన్నయ్య ప్రణయ్ ఉండే, అలాగే విజయ్కి వాళ్ల తమ్ముడు ఆనంద్ ఉండే. ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో విజయ్ దేవరకొండతో పాటు ఆనంద్ కూడా తమతోనే ఉన్నారని చెప్పారు. కాలిఫోర్నియా నుంచి డల్లాస్కు ఆనంద్ బ్లేజర్, ఫార్మల్ దుస్తుల్లో, క్లీన్ షేవ్తో వచ్చాడని గుర్తు చేశారు.
తమతో కలిసి రాత్రి వరకు సినిమా, పాటలు, టీజర్కు సంబంధించిన విషయాలపై ఆనంద్ ఎంతో ఆసక్తిగా చర్చించేవాడని సందీప్ చెప్పారు. తమతో కలిసి సమయం గడపడమే కాకుండా ఫుడ్ ఆర్డర్ చేయడం, అందరినీ చూసుకోవడం చేసేవాడని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆనంద్ ఐటీ ఉద్యోగం చేస్తున్నాడని మాత్రమే తనకు తెలుసని, సినిమా గురించి అతడికి ఉన్న ఆసక్తి, పరిశీలన తనను అప్పట్లోనే తనని ఆశ్చర్యపరిచిందన్నారు. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయం కావడం తనకు ఆసక్తికరంగా అనిపించిందని చెప్పారు. అనంతరం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘బేబీ’ వంటి మూవీస్తో ఆనంద్ తనకు నమ్మకం కలిగించేలా పాత్రలను పోషించాడని ప్రశంసించారు. ఆరేళ్లలోనే నాలుగు, ఐదు మంచి సినిమాలు చేశాడని అభినందించారు.
వైష్ణవి చైతన్య, ఆదిత్య హాసన్ల ప్రతిభను కూడా సందీప్ రెడ్డి వంగా ప్రశంసించారు. ‘బేబీ’ చిత్రంలో వైష్ణవి యాక్టింగ్ తనకు నచ్చిందన్నారు. ఆదిత్య హాసన్ డైరెక్షన్లో తెరకక్కిన ‘ఎపిక్’ టీజర్, ట్రైలర్, మ్యూజిక్ బాగున్నాయని చెప్పారు. ముఖ్యంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం తనకు ఎంతో ఇష్టమని అన్నారు. సెప్టెంబర్ 11న ‘ఎపిక్’ ప్రేక్షకుల ముందుకు రానుండగా, సెప్టెంబర్ 10న ప్రీమియర్స్ ఉంటాయని పేర్కొంటూ చిత్ర బృందానికి సందీప్ రెడ్డి వంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

