Sandeep Reddy Vanga: 2027లో భారీ పాన్ ఇండియా సినిమాల జాతర బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు తెరతీయబోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రానుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మార్చి 5, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేశ్బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది. అంటే ఈ రెండు భారీ చిత్రాల మధ్య దాదాపు 32 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది.
ఇంత తక్కువ వ్యవధిలో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడంతో వాటి మధ్య గ్యాప్ సరిపోతుందా? అనే ప్రశ్నకు సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతగా, సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా తెరకెక్కిన రోమాంచకం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. రెండు సినిమాల మధ్య కేవలం 32 రోజుల గ్యాప్ ఉందని, అది సరిపోతుందని అని ప్రశ్నించగా.. తన దైనశైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘స్పిరిట్’ కంటే ‘వారణాసి’ చాలా పెద్ద సినిమా అని వంగా వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తించింది. ‘వారణాసి’కి దారిచ్చేందుకు ‘స్పిరిట్’ను వాయిదా వేయాలని మీరు అనుకుంటున్నారా? అంటూ ఆయన సరదాగా వేసిన కామెంట్స్ ఈవెంట్లో నవ్వులు పూశాయి. బడ్జెట్ పరంగా చూస్తే ‘వారణాసి’కి భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘స్పిరిట్’కు హిట్ టాక్ వస్తే లాంగ్ రన్ ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా నార్త్ ఇండియాలో సినిమా ఎక్కువ రోజులు ప్రభావం చూపించవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఒకదాని తర్వాత మరొకటి విడుదల కానున్న ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఎవరి సినిమా ఎంతటి వసూళ్లు సాధిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారనుంది.

