రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ‘. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్కు వెళ్తుండగా ప్రొడక్షన్ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. కారు డివైడర్ను ఢీకొన్న వేగానికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురు సభ్యులు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వారిని పోలీసుల సహాయంతో వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరగడంతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
