ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ ప్లాట్ఫారమ్స్లో మ్యూజిక్ ఆల్బమ్స్ హవా నడుస్తోంది. ముఖ్యంగా ‘డ్యూడ్’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి అభ్యంకర్, తాజాగా అందించిన ‘పవళ మల్లి (Pavazha Malli)’ సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పాటలో తన గ్రేస్ఫుల్ డ్యాన్స్తో, గ్లామర్తో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి కయదు లోహర్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సాంగ్ వెనుక తాము పడ్డ కష్టాన్ని ఆసక్తికరంగా వివరించింది.
Also Read : Rahasya Gorak: కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ పై.. రహస్య గోరఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
ఈ ప్రాజెక్ట్ లోకి తాను ఎలా వచ్చాననే విషయంపై కయదు మాట్లాడుతూ.. ‘ఒకరోజు అర్ధరాత్రి సమయంలో సాయి అభ్యంకర్ నుంచి ఫోన్ రావడంతో మొదట ఆశ్చర్యపోయాను. కానీ ఆయన పాట వినిపించగానే నాకు చాలా బాగా నచ్చింది, వెంటనే ఓకే చెప్పేశాను’ అని వెల్లడించింది. అయితే ఆ పాట వినడానికి ఎంత బాగుందో, దాని చిత్రీకరణ కోసం తాము అంతకంటే ఎక్కువ కష్టపడ్డామని ఆమె చెప్పుకొచ్చింది..‘నిరంతర రిహార్సల్స్, షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా దాదాపు రెండు రోజుల పాటు నిద్ర లేకుండా పని చేశాం, అర్ధరాత్రి 2 గంటల వరకు షూట్ కొనసాగింది. ఒక పాటను పర్ఫెక్ట్గా తీసుకురావడానికి టీమ్ మొత్తం చూపించిన డెడికేషన్ ఇప్పుడు మిలియన్ల వ్యూస్ రూపంలో సక్సెస్ను అందిస్తోంది’ అని తెలిపింది.
ఇక తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘నేను అస్సాంకు చెందిన అమ్మాయిని కావడంతో ప్రారంభంలో తెలుగు, తమిళం, మలయాళం వంటి దక్షిణాది భాషలు మాట్లాడటం కొంత కష్టంగా అనిపించిందే. కానీ, ఒక నటిగా ఏ భాషలో నటిస్తే ఆ భాష నేర్చుకోవడం కనీస బాధ్యతని నేను నమ్ముతాను. అందుకే ప్రస్తుతం ఈ భాషల్లో అనర్గళంగా మాట్లాడటం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ప్రొఫెషనలిజం చూసి టాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ఫాలోయింగ్ను పెంచుకుంటున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ వంటి భారీ ప్రాజెక్టులో భాగమైంది. కయదు చూపిస్తున్న ఈ డెడికేషన్ చూస్తుంటే, త్వరలోనే ఆమె టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
