బెస్ట్ ఎడిటర్ గా నేషనల్ అవార్డును అందుకున్న వామన్ భోంస్లే (87) అనారోగ్యంతో గోరేగావ్ లో కన్నుమూశారు. 25వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ‘ఇన్ కార్’ చిత్రానికి గానూ ఆయన ఉత్తమ కూర్పరిగా అవార్డును అందుకున్నారు. వయోభారం కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో వామన్ భోంస్లే ఈ రోజు తెల్లవారుఝామున తన ఇంటిలోనే కన్నుమూశారు. గత యేడాది లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన వామన్ భోంస్లే జ్ఞాపకశక్తినీ కోల్పోయారు. 2000 సంవత్సరంలో ఆయన ఎడిటింగ్ కు స్వస్తి పలికారు. అమోల్ పాలేకర్ దర్శకత్వం వహించిన ‘కైరీ’ చిత్రానికి చివరగా ఎడిటింగ్ చేశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ ఎడిటింగ్ లో వామన్ భోంస్లే తన గురువు అని తెలిపారు. తన తొలి చిత్రం ‘కాళీ చరణ్’ నుండి ‘ఖల్ నాయక్’ వరకూ ఆయనే తన చిత్రాలను ఎడిటింగ్ చేశారని, ఆయన దగ్గర ఆ విద్యను నేర్చుకున్న తాను ‘తాళ్’ నుండి స్వయంగా ఎడిటింగ్ చేసుకుంటున్నానని సుభాష్ ఘాయ్ తెలిపారు.