Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?

Mokshagna Nandamuri

Mokshagna Nandamuri

Nandamuri Mokshagna: నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాన్నాళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన ఎంట్రీపై సస్పెన్స్ మాత్రం రోజురోజుకూ పెరుగుతోందే తప్ప వీడటం లేదు. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పట్టాలెక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని సమాచారం. నిజానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక సోషియో ఫాంటసీ లేదా మైథాలజీ బ్యాక్‌డ్రాప్ కథతో ఈ సినిమా ప్లాన్ చేశారనే గుసగుసలు కూడా అప్పట్లో జోరుగా వినిపించాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడటం లేదా ఆగిపోవడం జరిగిందని చెబుతున్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు మోక్షజ్ఞ కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

నందమూరి వారసుడిని లాంచ్ చేయడానికి టాలీవుడ్‌లోని పలువురు స్టార్ ప్రొడ్యూసర్లు, బడా బ్యానర్లు భారీ బడ్జెట్‌తో ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. స్టోరీలు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ, బాలకృష్ణ మాత్రం కొడుకు డెబ్యూ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. మొదటి సినిమానే ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ లేదా హై-విజువల్ వాల్యూస్ ఉన్న సబ్జెక్ట్‌తో ఇండస్ట్రీకి తన కొడుకును పరిచయం చేయాలని బాలయ్య గట్టి పట్టుదలతో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే సరైన దర్శకుడు, పక్కా స్క్రిప్ట్ కుదిరే వరకు ఎంత సమయమైనా వెయిట్ చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ లెక్కన చూస్తుంటే, ఈ ఏడాది కేవలం స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులకే పరిమితం కానుందని.. మోక్షజ్ఞ వెండితెరపై కనిపించడానికి మరికొంత కాలం ఓపిక పట్టక తప్పదని చెబుతున్నారు.