టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా (#King100) సెన్సేషన్కు సిద్ధమవుతోంది. తనదైన స్టైల్, గ్రేస్ తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న నాగ్.. తన మైల్ స్టోన్ మూవీని చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంతో యువ దర్శకుడు రా కార్తీక్ టాలీవుడ్కి డైరెక్టర్గా పరిచయమవుతున్నారు.
నాగార్జున పుట్టినరోజు (ఆగస్టు 29) సందర్భంగా అక్కినేని అభిమానులకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. బర్త్ డే కి కేవలం మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభిమానుల్లో కౌంట్ డౌన్ మొదలైంది. ఈ స్పెషల్ డే కానుకగా సినిమాకు సంబంధించిన ‘టైటిల్ గ్లింప్స్’ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ల్యాండ్ మార్క్ ఫిల్మ్ కావడంతో మేకర్స్ ఎలాంటి టైటిల్ తో రాబోతున్నారో తెలుసుకోవాలన్న ఉత్కంఠ సినీ వర్గాల్లోనూ, ఫ్యాన్స్ లోనూ విపరీతంగా నెలకొంది. ఈ సినిమాలో నాగార్జున సరసన సీనియర్ స్టార్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ లాంటి బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ తర్వాత నాగార్జున, టబు కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుండటం ఈ ప్రాజెక్టుపై హైప్ ను అమాంతం పెంచేసింది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని మళ్లీ వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున, దేవి శ్రీ కాంబోలో ఇప్పటికే ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉండటంతో ఈ సినిమా ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలున్నాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆగస్టు 29న విడుదల కాబోయే టైటిల్ గ్లింప్స్ తో పాటే, చిత్రంలోని ఇతర భారీ తారాగణం, టెక్నీషియన్ల వివరాలను కూడా మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.

