Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రల్లో కనిపించింది. అయితే ‘మైసా’ మాత్రం ఆమె కెరీర్లోనే పూర్తిగా కొత్త జానర్ను పరిచయం చేయబోతోంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక గిరిజన గోండు మహిళగా కనిపించనుంది. తాజాగా విడుదలైన టీజర్కు వస్తున్న స్పందన చూస్తుంటే.. ఈ పాత్ర కోసం ఆమె ఎంతగా మేకోవర్ అయ్యిందో అర్థమవుతోంది. అయితే తెరపై కనిపించే ఆ యాక్షన్ వెనుక రష్మిక పడిన కష్టం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో ‘మైసా’ షూటింగ్లో తనకు ఎదురైన అనుభవాలను రష్మిక స్వయంగా వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా కేరళలోని ఓ భారీ వాటర్ఫాల్ వద్ద తనతో ప్రమాదకరమైన స్టంట్ చేయించినట్లు రష్మిక వెల్లడించారు.
ఎత్తులంటే తనకు భయమని చెప్పిన రష్మిక.. అంత ఎత్తు నుంచి కిందికి చూడటమే భయంగా అనిపించిందని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాటర్ఫాల్ వద్ద జంప్ చేయాల్సి రావడంతో షూటింగ్కు వెళ్లే ముందు తాను వణికిపోయానని చెప్పుకొచ్చింది. అయితే దర్శకుడి విజన్ కోసం ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఇదే కాదు.. ‘మైసా’లో అండర్వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందట. మొదట స్విమ్మింగ్ తనకు వచ్చు కాబట్టి సులభంగానే ఉంటుందని అనుకున్నానని రష్మిక చెప్పింది. కానీ సీన్ కోసం గంటల తరబడి నీటిలో ఉండాల్సి రావడంతో అసలు కష్టం అప్పుడు తెలిసిందట. ఒకరోజు దాదాపు ఎనిమిది గంటల పాటు అండర్వాటర్ షూటింగ్ చేయాల్సి వచ్చిందని ఆమె వివరించింది. నేను ఫిష్ కాదుగా అన్ని గంటల పాటు వాటర్లో ఉండటానికి అని అన్నారు. సాధారణంగా ఊహించుకునే యాక్షన్ సీన్ కాదని, నీటిలో గంటలపాటు షూట్ చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పింది.
‘మైసా’ షూటింగ్లో మరో సవాలు మడ్ ఫైట్ అని రష్మిక వెల్లడించింది. మట్టిలో యాక్షన్ సీన్ చేయాల్సి రావడంతో శరీరం మొత్తం బురదతో నిండిపోయేదని, ఆ తర్వాత కనీసం ఒక అడుగు వేయడం కూడా కష్టంగా అనిపించేదని చెప్పింది. దర్శకుడు మాత్రం ప్రతి సీన్లోనూ ‘రియల్ ఫీలింగ్’ కావాలని పట్టుబట్టారని రష్మిక తెలిపింది. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సన్నివేశాలను పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చింది. ‘మైసా’ కోసం యాక్షన్ మాత్రమే కాదు.. డ్యాన్స్లోనూ రష్మికకు గట్టి పరీక్ష ఎదురైంది. షూటింగ్ సమయంలో ఆమె హిప్కు గాయం అయిందని వెల్లడించింది. స్కానింగ్ చూసిన డాక్టర్.. సాధారణ నటికి సంబంధించిన స్కాన్లా లేదని, ఫుట్బాల్ ప్లేయర్ స్కాన్లా ఉందని చెప్పినట్లు రష్మిక నవ్వుతూ గుర్తుచేసుకుంది. గాయం కారణంగా కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను ఎప్పుడూ ఒక సినిమాలో కొత్తగా ఏదో ఒక అంశం ఉండాలని కోరుకుంటానని రష్మిక చెప్పింది. కొత్త క్యారెక్టర్ అయినా, కొత్త పెర్ఫార్మెన్స్ అయినా.. ప్రేక్షకులు తనను ఇంతకుముందు చూడని విధంగా చూపించాలనుకుంటానని పేర్కొంది.
‘మైసా’ విషయంలో దర్శకుడి విజన్ తనకు నచ్చిందని, అందుకే ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధపడ్డానని చెప్పింది. తాను మాటల్లో షూటింగ్ కష్టమని కంప్లైంట్ చేసినా.. దర్శకుడు ఒక విజన్తో వస్తే దాన్ని సపోర్ట్ చేయడం తన బాధ్యతగా భావిస్తానని రష్మిక పేర్కొంది. ఇక ‘మైసా’ టీజర్లో రష్మిక కనిపించిన రౌద్ర అవతార్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. నవంబర్ 27న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో.. టీజర్లో చూసిన యాక్షన్కు మించి సినిమాలో ఇంకా ఎలాంటి సాహసాలు చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

