Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!

Mr.work From Home

Mr.work From Home

Trigun: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్ర యూనిట్ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ట్రెండ్‌ను ప్రోత్సహించడం తమ సినిమాకు కలిసి వచ్చే అంశమని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి, సొంత ఊరిలో వ్యవసాయం చేయాలనుకునే ఒక యువకుడి కథే ఈ సినిమా అని, ఇది ప్రస్తుత ట్రెండ్‌కు అద్దం పడుతుందని హీరో త్రిగుణ్ పేర్కొన్నారు.

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ఈ వేసవిలో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. ఇంటి నుంచి పని చేసే క్రమంలో ఒక కుర్రాడు తన ఫ్యామిలీ, ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు? అనే అంశాలను వినోదాత్మకంగా చూపించాం. మంచి టీమ్‌తో నిజాయితీగా చేసిన ప్రయత్నం ఇది” అని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ రాందాస్ మాట్లాడుతూ.. చిన్న సినిమాలను విడుదల చేయడం ప్రస్తుతం రిస్క్‌తో కూడుకున్న పని అయినప్పటికీ, ఈ చిత్రంలోని క్వాలిటీ నచ్చి ముందుకు వచ్చామని తెలిపారు. అనీష్ కురువిల్లా, శివాజీ రాజా, వైవా హర్ష, సుదర్శన్ వంటి ప్రముఖ నటులు ఉండటం సినిమాకు పెద్ద అసెట్ అని ఆయన పేర్కొన్నారు. నిర్మాత అరవింద్, దర్శకుడు మధుదీప్ మాట్లాడుతూ.. రాందాస్ గారు అందించిన సహకారం మరువలేనిదని, ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసును తాకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కమర్షియల్ హంగులతో కూడిన ఈ ఫ్యామిలీ డ్రామా మే 15న థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉందన్నారు.