Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!

Mandadi

Mandadi

తమిళ నటుడు సూరి, టాలీవుడ్ యంగ్ టాలెంట్ సుహాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. తమిళనాడులో ఫేమస్ అయిన బోట్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సముద్రం నడిబొడ్డున ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తీసిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేదికపై నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ సంచలన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశామని, ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ స్వయంగా కాల్ చేసి మరీ సహాయం చేస్తానని చెప్పడం గొప్ప విషయమన్నారు. ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ కావడంలో నవీన్ సహకారం మరువలేనిదని ఆయన వెల్లడించారు. ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. సముద్రంలో పడవ షాట్ తీయడమే ఎంతో కష్టమని, అలాంటిది సినిమా మొత్తాన్ని సముద్రంలో తీయడం అనేది మామూలు విషయం కాదని, చిత్ర యూనిట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు శివ నిర్వాణ సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేశారు. సినిమా కంటెంట్ చాలా గ్రాండ్‌గా ఉందని, భవిష్యత్తులో ఈ ‘మండాడి’ చిత్రానికి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. హీరో సుహాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోయిన్ మహిమా నంబియార్, రవీంద్ర విజయ్, సూరిల నటన మెయిన్ హైలైట్ కానుందని, సెప్టెంబర్ 10న ఒక వినూత్నమైన కంటెంట్ చూడటానికి ఆడియన్స్ రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు. తమిళ హీరో సూరి తనదైన శైలిలో మాట్లాడుతూ.. “ఈ సారికి నన్ను వదిలేయండి, వచ్చేసారి కచ్చితంగా తెలుగులో మాట్లాడతా” అంటూ నవ్వులు పూయించారు. సుహాస్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నటుడు రవీంద్ర విజయ్ మాట్లాడుతూ, ఇలాంటి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెలుగు ఆడియన్స్‌కు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌ పై ఇప్పుడు టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.