మలయాళ నటి రెమ్య సురేష్ సైబర్ క్రైమ్ ను ఆశ్రయించారు. ఇంటర్నెట్ లో తన మార్ఫింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అలప్పుజ పోలీసులకు, సైబర్ సెల్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ వీడియోలోని మహిళ రెమ్య సురేష్ను పోలి ఉందని చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయిపోయారు. ఈ పరీక్ష సమయాల్లో తన భర్త తనకు అండగా నిలుస్తున్నాడని రెమ్య సురేష్ తన వీడియోలో పేర్కొన్నారు. వీడియోలోని మహిళ తాను కాదని, తన కెరీర్లో ఎలాంటి రాజీ పడకుండా ఈ దశలో ఉన్నానని చెబుతూ రెమ్య ఏడ్చేశారు. “నేను రెమ్య సురేష్, ఇంటర్నెట్లోవైరల్ అవుతున్న వీడియోతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి దాన్ని వ్యాప్తి చేయవద్దు. వీడియోలో ఉన్న ఆమె నాలాంటి ముఖ పోలికలతో ఉంది. అయితే నేను బాగా తెలిసిన వారు నాలో, తనలో ఉన్న పోలికను గమనించగలరు. కానీ తెలియని వారు మాత్రం నేనే అనుకుంటారు. అదే నాకు భయంగా ఉంది” అని రాశారు. తనకు మద్దతుగా తన కుటుంబం ఉండడంతో ఈ సమస్యను పరిష్కరించుకోగలనని రెమ్య సురేష్ అన్నారు. ఆమె చివరిసారిగా నయనతార నటించిన ‘నిజాల్’ చిత్రంలో కన్పించింది.