మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో జూన్ 4న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ ‘థాంక్ యూ’ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ సినిమాపై నెగిటివ్ రివ్యూలు రాసేవారిని ఉద్దేశించి, అలాగే రామ్ చరణ్ నటనను కొనియాడుతూ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. సక్సెస్ మీట్లో ప్రముఖ రైటర్ అనంత శ్రీరామ్ నెగిటివ్ రివ్యూలు రాసేవారిపై తన ట్రేడ్మార్క్ స్టైల్లో విరుచుకుపడ్డారు.
ప్రెస్ మీట్లో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. “పరాన్నజీవుల్లా బతుకుతూ, పైశాచిక ఆనందం పొందుతూ నెగిటివ్ రివ్యూలు రాసేవాళ్లు కొందరున్నారు. అసలు వినోదాన్ని ఎలా రాయాలో తెలియక, విషయం బోధపడక విషం కక్కే వాళ్లు సృష్టించే భావ దారిద్యపు బాలారిష్టాలను దాటుకుని మరీ మా ‘పెద్ది’ బాక్సాఫీస్ను బద్దలుకొట్టింది. విజయశిఖరం వైపు దూసుకుపోతున్న మా పెద్ది బృందాన్ని అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా నమస్కారాలు” అంటూ ఘాటుగా స్పందించారు.
హీరో రామ్ చరణ్ పడిన కష్టం, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అనంత శ్రీరామ్ అద్భుతమైన కవిత్వంతో కొనియాడారు. “దర్శకుడు బుచ్చిబాబు గారు ‘పెద్ది’ పాత్రను కేవలం ఊహించి ఇస్తే.. ఆ శిల్పం ఎలా ఉండాలో రామ్ చరణ్ గారు పూర్తిగా జీర్ణించుకున్నారు. ఈ సినిమా కోసం చరణ్ గారే రాయిగా, తనే శిల్పిగా, తనే ఉలిగా, తనే ఆ శిల్పంగా మారి తనని తాను చెక్కుకున్నారు. మనందరి ముందు నిలబడి ఆ శిల్పానికి తన అద్భుత నటనతో జీవం పోశారు. ఈ ఘన విజయంలో ముఖ్య భూమిక పోషించిన మా హీరో రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అని ఎమోషనల్ అయ్యారు.

