కొత్త ప్రతిభకు అవకాశం కల్పిస్తూ, ఎటువంటి అసభ్యత లేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”. వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్ను లాంఛ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ట్రైలర్ చూసిన తర్వాత అతిథులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఒక జంట మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల వారి జీవితంలో ఎదురైన సవాళ్లు, తమ బంధాన్ని వాళ్లు ఎలా నిలబెట్టుకున్నారు అనే ఆసక్తికరమైన పాయింట్తో ఈ సినిమా రూపొందింది. కొత్తవారైనా ఎక్కడా ఆ ఫీలింగ్ రాకుండా, అద్భుతమైన నటన, సాంకేతిక విలువలతో ఈ చిత్రం ప్రతి ఫ్రేమ్లోనూ రిచ్గా కనిపిస్తోందని ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ ప్రశంసించారు. కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనే తేడా లేకుండా ఆడియన్స్ ఆదరిస్తారని, ఈ మూవీ కూడా ‘అర్జున్ రెడ్డి’, ‘బేబి’ స్థాయిలో విజయవంతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు.
ఇక ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. యూఎస్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న తమకు సినిమాపై ఉన్న ప్యాషన్తోనే ఈ చిత్రాన్ని నిర్మించామని, ఇందులో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఎటువంటి వెకిలి కమర్షియల్ అంశాలు లేకుండా, కుటుంబ సమేతంగా చూడదగ్గ స్వచ్ఛమైన ప్రేమకథ ఇదని చిత్ర దర్శకుడు రవి లోకిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మూవీలో స్టార్ మేకర్ సత్యానంద్ ఒక ముఖ్య పాత్ర పోషించడం విశేషం.

