టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఒకటైన ఎన్టీఆర్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి సినిమా వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా రెండు పవర్ఫుల్ టైటిళ్లను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. సుబ్రహ్మణ్య స్వామి (కార్తికేయ) పురాణ ఇతిహాసాల ఆధారంగా, దైవిక అంశాలతో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ మైథలాజికల్ ఎపిక్ కోసం ‘దేవసేనాపతి’, ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు టైటిల్స్లో ఏది ఖరారవుతుందనేది త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నప్పటికీ, ఈ టైటిల్స్ రిజిస్ట్రేషన్ వార్త మాత్రం ఫ్యాన్స్లో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పురాణాల స్ఫూర్తితో, అత్యాధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, లోతైన భావోద్వేగాలు మరియు ఉత్కంఠభరితమైన యుద్ధ ఘట్టాలతో ఈ సినిమా ఒక అపూర్వమైన సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. త్రివిక్రమ్ రాసే పదునైన సంభాషణలు, ఎన్టీఆర్ అభినయం కలగలిస్తే వెండితెరపై సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉండగా, తాజాగా ఈ టైటిల్స్ తెరపైకి రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. త్వరలోనే మేకర్స్ నుంచి ఈ ప్రాజెక్ట్కు సంబంధించి మరిన్ని సంచలన వివరాలు వెలువడే అవకాశం ఉంది. .

