Srinivasa Mangapuram ఘట్టమనేని కుటుంబం నుంచి టాలీవుడ్కు మరో కొత్త హీరో పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, హీరో మహేష్ బాబు సోదరుడు.. దివంగత రమేష్ బాబు కుమారుడు, జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ‘శ్రీనివాసమంగాపురం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయమవుతోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల వాయిదా పడినట్లు ఇప్పుడు సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్పై మిథునమ్ కిరణ్, సి.అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. మహేష్ బాబు వారసుడి ఎంట్రీ కావడం, అజయ్ భూపతి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో ఘట్టమనేని అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమాను జూలై 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ జూలై రేస్ నుంచి తప్పుకుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొంత మేర బ్యాలెన్స్ ఉండటం, అలాగే ప్రమోషన్స్ కోసం మరికొంత సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అవుట్పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని డైరెక్టర్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

