హాలీవుడ్ విజువల్ వండర్ జేమ్స్ కామెరూన్ అంటేనే థియేటర్ ఎక్స్పీరియెన్స్కు కేరాఫ్ అడ్రస్. అలాంటి దర్శకుడు ఇప్పుడు థియేటర్ల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ సంస్థ వార్నర్ బ్రదర్స్ స్టూడియోను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుండటం సినిమా రంగానికి ఒక ‘విపత్తు’ అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు అమెరికన్ సెనేటర్ మైక్ లీకి ఆయన ఒక ఘాటైన లేఖ రాస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
Also Read : Ayesha Khan : అది నేను కాదు నమ్మకండి.. ఫేక్ అకౌంట్లపై ఆయేషా ఖాన్ ఫైర్..!
జేమ్స్ కామెరూన్ తన లేఖలో థియేట్రికల్ బిజినెస్కు రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించారు.. ‘నా సినిమాలు తర్వాత ఓటీటీ లేదా ఇతర ప్లాట్ఫామ్స్లో రావచ్చు.. కానీ ఒక దర్శకుడిగా నా మొదటి ఆప్షన్ ఎప్పుడూ థియేటర్ ఎక్స్పీరియెన్సే’ అని ఆయన స్పష్టం చేశారు. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కేవలం సబ్స్క్రిప్షన్ల మీద మాత్రమే ఆధారపడతాయని, దీనివల్ల సినిమాలు నేరుగా ఓటీటీకి వెళ్లే ధోరణి పెరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వార్నర్ బ్రదర్స్ వంటి పెద్ద స్టూడియోలు తమ రూట్ మార్చుకుంటే, మిగిలిన స్టూడియోల మీద కూడా ఒత్తిడి పెరిగి భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం తగ్గిపోయే ప్రమాదం ఉందని కామెరూన్ హెచ్చరించారు. థియేటర్ రిలీజ్ విండోలు తగ్గిపోవడం వల్ల వేలాది మంది థియేటర్ కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. నెట్ఫ్లిక్స్ వంటి దిగ్గజాలు కేవలం బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తే సినిమా అనే కళాఖండం తన ఉనికిని కోల్పోతుందని ఆయన గట్టిగా వినిపించారు.
అయితే నెట్ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరాండోస్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. జేమ్స్ కామెరూన్ తప్పుగా అర్థం చేసుకున్నారని, తాము వార్నర్ బ్రదర్స్ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, కామెరూన్ మాత్రం థియేటర్ ఎక్స్పీరియెన్స్ను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని సంకేతాలు ఇచ్చారు.