తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్న వేళ సినీ కార్మిక సమాఖ్య (ఫెఫ్సీ – FEFSI) కీలక ప్రకటన చేసింది. నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నప్పటికీ, సమ్మె వల్ల వేలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడతాయని హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం, తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి సామరస్యపూర్వక పరిష్కారం దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చిత్రాల షూటింగ్లు, విడుదలతో పాటు అన్ని సినీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించడంపై ఫెఫ్సీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిర్మాతల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఫెఫ్సీ, ఇలా ఏకపక్షంగా పరిశ్రమను స్తంభింపజేయడం సరైన మార్గం కాదని పేర్కొంది. చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే రోజువారీ వేతన కార్మికులు, వారి కుటుంబాలు ఈ బంద్ వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడతాయని ఆవేదన చెందింది.
2023లో విశాల్ అధ్యక్షతన జరిగిన 45 నుంచి 50 రోజుల సుదీర్ఘ సమ్మెను ఫెఫ్సీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. అప్పట్లో ప్రభుత్వం సమక్షంలో నిర్మాతలు, థియేటర్ల యజమానులు, కార్మిక సంఘాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని, అయితే అందులో మెజారిటీ నిర్ణయాలు నేటికీ అమలుకు నోచుకోలేదని గుర్తు చేసింది. సమస్య వచ్చిన ప్రతిసారీ షూటింగ్లు ఆపేయడం, ఆ తర్వాత చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయాలను విస్మరించడం వల్ల పరిశ్రమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది.
పరిశ్రమ భవిష్యత్తు కోసం కలిసి పనిచేద్దాం ఈ తరహా ఆందోళనలు, నిరసనల వల్ల అటు నిర్మాతలు, ఇటు కార్మికులతో పాటు మొత్తం చిత్రసీమ కోలుకోలేని నష్టాన్ని చవిచూస్తుందని ఫెఫ్సీ ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం, నిర్మాతల మండలితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, సినీ కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఫెఫ్సీ పిలుపునిచ్చింది.

