భారతీయ సినీ పరిశ్రమ మరో చరిత్రాత్మక దశలోకి అడుగుపెడుతోందా? అంటే.. అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఇప్పటివరకు హీరోల ఆధిపత్యం ఎక్కువగా కనిపించిన ఇండియన్ సినిమాల్లో.. ఇప్పుడు డైరెక్టర్ల యుగం మొదలైందనే చెప్పాలి. కారణం ఒక్కటే.. ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులు ఇప్పుడు మరో రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అవే ఇండియన్ సినిమాల భవిష్యత్తును మార్చబోయే మెగా సినిమాలు.
ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘దంగల్’. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నితేష్ తివారి ఇప్పుడు మరో లెజెండరీ ప్రాజెక్ట్తో వస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు ‘రామాయణం’. భారతీయ సంస్కృతి, ఇతిహాసాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ డెప్త్, గ్రాండ్ మేకింగ్తో రామాయణాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నితేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దంగల్తో ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు గౌరవం తెచ్చిన ఆయన.. రామాయణంతో మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇక ఇండియాలో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘బాహుబలి 2’. ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్కు తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఇప్పుడు ‘వారణాసి’ అనే భారీ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా నిలవబోతోందనే అంచనాలు ఉన్నాయి. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్తో పాటు భారతీయ చరిత్రను ప్రతిబింబించేలా ఈ సినిమాను రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్.
దంగల్, బాహుబలి సిరీస్ లాంటి రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు చేసిన దర్శకులు నితేష్ తివారి, ఎస్ఎస్ రాజమౌళిలు.. ఇప్పుడు మరోసారి అత్యంత భారీ స్థాయిలో సినిమాలు తెరకెక్కించేందుకు సిద్ధమవుతుండటం ఇండియన్ సినిమాకు గర్వకారణం. హీరోల పేర్ల కన్నా దర్శకుల పేర్లే సినిమాలకు బ్రాండ్గా మారుతున్న ఈ దశలో.. ఇది నిజంగా ‘డైరెక్టర్ల యుగం’ అని చెప్పుకోవచ్చు. రామాయణం, వారణాసి వంటి సినిమాలు విడుదలైతే.. ఇండియన్ సినిమా మరోసారి ప్రపంచ సినీ పటంలో కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయం.
