Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సమర్పణలో రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా “పెద్ది”. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను విజయవాడలో కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడిన మాటలు, సినిమాపై ఆయన నమ్మకం మెగా ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పించాయి.
ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ.. విజయవాడతో తనకున్న సెంటిమెంట్ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. “ఉప్పెన సినిమా టైంలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ తొక్కుకుంటూ ఈ ‘పెద్ది’ కథ రాసుకున్నాను. నేను తండ్రిని కాబోతున్నానని డాక్టర్ నాకు చెప్పింది కూడా ఈ విజయవాడలోనే! ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయి. ‘ఉప్పెన’కు నేషనల్ అవార్డు వచ్చింది, ప్రొడ్యూసర్లకు, నాకు చాలా డబ్బులు వచ్చాయి. ఐదేళ్లు ఎందుకు గ్యాప్ తీసుకున్నావంటే.. అది కేవలం ఈ ‘పెద్ది’ సినిమా కోసమే” అని స్పష్టం చేశారు.
మెగాస్టార్ ఉప్పెన ఇస్తే.. చరణ్ సార్ ‘పెద్ది’ ఇచ్చారు!
తన గురువు సుకుమార్ను గుర్తుచేసుకుంటూ రామ్ చరణ్పై ప్రశంసలు కురిపించారు బుచ్చిబాబు. “ఉప్పెన తర్వాత ఎవరితో సినిమా చేయాలని టెన్షన్లో ఉంటే, మా గురువుగారు సుకుమార్ సార్ నన్ను చరణ్ సార్ దగ్గరకు తీసుకెళ్లారు. నాకు ‘ఉప్పెన’ మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే.. ఈ ‘పెద్ది’ని రామ్ చరణ్ గారు ఇచ్చారు. దేవుడికి మొక్కుకుని వెళ్లి చరణ్ సార్కి కథ చెప్తే.. ఆయన ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఓకే చేశారు. రెండో సినిమా డైరెక్టర్ను నమ్మి ఇంత పెద్ద స్టార్ హీరో 350 కోట్ల బడ్జెట్ సినిమా ఇవ్వడం మామూలు విషయం కాదు సార్. నన్ను, నా కథలోని నిజాయితీని నమ్మిన చరణ్ సార్కి జీవితాంతం రుణపడి ఉంటా” అని ఎమోషనల్ అయ్యారు.
ఆట అంటే ఆకతాయితనం కాదు.. ‘పెద్ది’ పడి లేచిన మనిషి కథ..
సినిమా లైన్ గురించి లీక్ ఇస్తూ.. “పెద్ది అంటే కేవలం ఒక కమర్షియల్ సినిమా కాదు.. కమర్షియాలిటీతో కూడిన ఒక పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామా. విజయనగరం నేపథ్యంలో సాగే ఒక కుర్రోడి రూటెడ్ కథ ఇది. ఆట అంటే ఇప్పటివరకు చాలామంది ఆకతాయితనం అనుకున్నారు. కానీ ఆ ఆట ఒక మనిషికి ఎలాంటి గుర్తింపు, గౌరవం తెస్తుంది.. తన చుట్టూ ఉన్న మనుషుల్ని ఎలా మారుస్తుంది అని చెప్పే కథే పెద్ది. ఇది అలలా ఎగసిపడిన మనిషి కథ కాదు.. పడినా కూడా సింహంలా లేచిన మనిషి కథ. పెద్దిగాడికి విజయం అంత ఈజీగా దక్కలేదు, ఎన్నో ఆటంకాలను దాటుకుని సాధించాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అని ఈ సినిమా నిరూపిస్తుంది” అని బుచ్చిబాబు పేర్కొన్నారు.
లాస్ట్ 50 నిమిషాలు కళ్లు చెమర్చాల్సిందే..
సినిమా అవుట్పుట్పై బుచ్చిబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. “ఈ సినిమాను నేను ఇప్పటివరకు 50 నుంచి 100 సార్లు చూశాను. సెకండ్ హాఫ్లో లాస్ట్ 40 నుంచి 50 నిమిషాలు నేను ప్రతిసారి ఎమోషనల్ అయిపోతాను, నా కళ్ల వెంట నీళ్లు వస్తాయి. చరణ్ సార్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థియేటర్లో మీకూ కన్నీళ్లు రాకుండా ఉండవు. అలాగే ఇందులో జగపతి బాబు గారు ‘అప్పలసూరి’ అనే మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ చేశారు. అప్పలసూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్లల్లో నీళ్లు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానయే కాదు” అని సవాల్ విసిరారు.
చిత్ర యూనిట్ గురించి మాట్లాడుతూ.. “హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ రస్టిక్ మట్టి కథలోకి వచ్చి కలర్ యాడ్ చేశారు. ఈ సినిమాలో ఆమె హెచ్సీఎం క్యారెక్టర్ చేశారు. కొన్ని సీన్స్లో ఆమె పర్ఫార్మెన్స్ ఒక మగరాయిలా, ఫుల్ హీరోయిజంతో ఉంటుంది. క్లైమాక్స్లో ఆమె యాక్టింగ్ ఎవరూ మర్చిపోలేరు. ఇక లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా స్టైలిష్గా, ఊరమాస్గా వచ్చింది. ఆయనతో వర్క్ చేయడం నా చిరకాల కోరిక. డీఓపీ రాండీ గారు నా అక్షరానికి ప్రాణం పోశారు, అవినాష్ కోలా 20 అద్భుతమైన నాచురల్ సెట్స్ వేశారు” అని టీమ్ అందరికీ థాంక్స్ చెప్పారు. చివరగా యాంకర్ సుమా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “పదేళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అది కేవలం రామ్ చరణ్ సార్ వల్లే సాధ్యం. ఒక స్టార్ హీరో ఇలాంటి రూటెడ్ కథను నమ్మి చేయడం టాలీవుడ్లో ఒక హిస్టరీ” అని చెప్తూ జూన్ 4న ఫ్యామిలీస్, కిడ్స్తో కలిసి థియేటర్లలో ‘పెద్ది’ ఎమోషన్ను విట్నెస్ చేయాలని బుచ్చిబాబు పిలుపునిచ్చారు.
