తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల భద్రత, క్యాస్టింగ్ కౌచ్ అంశంపై నటి చాందిని చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాయ్ బిస్కెట్ నిర్వహించిన “ది ఆడిషన్ షో” కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుని ఒక్కసారిగా కలకలం రేపారు. 2015లో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్గా అవకాశం ఇస్తామంటూ ఒక వ్యక్తి తన వద్దకు వచ్చాడని చాందిని తెలిపారు.సెట్లో తన తల్లి సమక్షంలోనే మాట్లాడిన ఆ వ్యక్తి, ఆ తర్వాత ఫోన్ చేసి “నువ్వు చూడటానికి అంత బాగుండవు, రంగు కూడా లేవు.. నిన్ను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలంటే కన్విన్స్ చేయాలి” అని అన్నాడని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత సదరు వ్యక్తి చాందినికి ఫోన్ చేసి, “సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి.. నీ కమిట్మెంట్ ఏంటో నేను చూడాలి” అంటూ పరోక్షంగా లైంగిక వేధింపులకు దిగాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె దానికి ఒప్పుకోకపోవడంతో, ఆ వ్యక్తి ఆమె తల్లికి ఫోన్ చేసి “మీ అమ్మాయి అసలు చూడటానికి బాగుండదు, ప్రొడ్యూసర్ను కన్విన్స్ చేయాలి” అంటూ అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన చాందిని తల్లి, “నువ్వు ఆర్టిస్టుల కోసం చూస్తున్నావా లేక బ్రోకర్ పనులు చేస్తున్నావా? మరోసారి ఫోన్ చేస్తే పోలీసులకు పట్టిస్తాం” అని గట్టిగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
ఈ సంఘటన తర్వాత సదరు వ్యక్తి పరిశ్రమలో తనపై తీవ్రమైన దుష్ప్రచారం మొదలుపెట్టాడని చాందిని వెల్లడించారు. “చాందినికి పొగరు ఎక్కువ, ఆమెతో పనిచేయడం చాలా కష్టం, కంఫర్టబుల్గా ఉండదు” అని రూమర్లు సృష్టించారని, ఆ నెగెటివ్ ముద్ర ఇప్పటికీ తనపై కొనసాగుతోందని చెప్పారు. అయితే, అడ్డదారుల్లో అవకాశాలు పొంది ఈజీగా ఉండటం కంటే డిఫికల్ట్గా ఉండటమే మంచిదని ఆమె ధీటుగా బదులిచ్చారు. 2024లో ‘గామి’, ‘ఏవం’, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాల ప్రమోషన్ల సమయంలో హైదరాబాద్లోని ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు, ఒక స్టైలిస్ట్ ద్వారా ఓ ప్రొడ్యూసర్ తన వద్దకు వచ్చారని చాందిని గుర్తుచేసుకున్నారు. ఆ ప్రొడ్యూసర్ “మనం 2015లో ఒక జ్యువెలరీ యాడ్ కోసం మాట్లాడాం” అని గుర్తు చేయగానే… చాందిని వెంటనే స్పందిస్తూ “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అని ఆయన ముఖం మీదే నేరుగా నిలదీశానని చెప్పారు. ఆ మాట వినగానే ఆయన ముఖం మాడిపోయిందని తెలిపారు. మొదట్లో తాను చాలా సాఫ్ట్గా ఉండేదాన్నని, కానీ పరిశ్రమలో ఎదురైన ఇలాంటి సంఘటనల వల్లనే తన రక్షణ కోసం ‘డిఫెన్స్ మెకానిజం’గా ఈ రకమైన కఠిన వైఖరిని అలవర్చుకున్నానని చాందిని స్పష్టం చేశారు. నిజాయితీగా పనిచేసే వారితో కలిసి పనిచేస్తానని, తేడాగా ప్రవర్తిస్తే అసలు స్కోప్ ఇవ్వనని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతం చాందిని చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

