నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ సినిమా అంటే అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో మోకాలికి గాయం అవడంతో మోకాలుకి సర్జరీ చేసి బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ చేయాలనీ డైరెక్టర్ కు తెలిపాడట. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకోమని సూచించారట. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.
బాలయ్యకు డిసెంబర్ మాసం బాగానే కలసి వచ్చింది. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ భారీ ఓపెనింగ్స్ చూసిన ‘పట్టాభిషేకం’, అనూహ్య విజయం సాధించిన ‘లారీ డ్రైవర్’, ప్యాండమిక్ తరువాత జనాన్ని థియేటర్స్ కు రప్పించిన ‘అఖండ’ చిత్రాలు డిసెంబర్ లోనే రిలీజయ్యాయి. అందువల్లే తాను గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తోన్న రెండో సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారు. కాసింత ఆలస్యం చేసి జనవరిలో పొంగల్ బరిలోనే దూకితే మంచిదని కొందరు సూచిస్తున్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి పలు చిత్రాలు విడుదలవుతున్నాయి.. ఈ నేపథ్యంలో వారికి దారి ఇచ్చి తన సినిమాను ముందే రిలీజ్ చేస్తే మేలని బాలయ్య అనుకుంటున్నారు. డిసెంబర్ నెలలోనూ భారీ చిత్రాలే వస్తున్నాయి. డిసెంబర్ 3న ప్రభాస్ ‘ఫౌజీ’ వస్తోంది. ఇక డిసెంబర్ 18న హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ‘అవెంజర్స్ – డూమ్స్ డే, డ్యూన్-3’ వస్తున్నాయి. డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్ ‘కింగ్’ రిలీజ్ కానుంది. కాబట్టి సరైన తేదీని చూసుకొని బాలయ్య తన సినిమాను జనం ముందు నిలిపితే మంచిదనీ కొందరి మాట. మరి బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీ ఎప్పుడు ఎలా ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.

