Site icon NTV Telugu

Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!

Ashu Reddy

Ashu Reddy

సోషల్ మీడియా సెలబ్రిటీ, నటి అషు రెడ్డి చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం ముసురుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు వసూలు చేయడమే కాకుండా.. ఇప్పుడు ప్రాణహాని తలపెడుతున్నారంటూ ధర్మేంద్ర అనే వ్యక్తి సీసీఎస్ (CCS) పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. వీరిద్దరి మధ్య పరిచయం అమెరికాలో ఉన్నత చదువుల సమయంలో మొదలైంది. 2018లోనే ప్రేమలో పడిన వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి హైదరాబాద్ వెళ్లి యాక్టింగ్ కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నట్లు అషు రెడ్డి చెప్పడంతో, ధర్మేంద్ర ఆమెకు పూర్తి ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచారు. అప్పటికే తనకు విడాకులు అయిన విషయాన్ని అషు రెడ్డి ధర్మేంద్రకు వెల్లడించినప్పటికీ, ప్రేమతో ఆమె వ్యక్తిగత అవసరాల కోసం ప్రతి నెలా భారీగా నిధులు పంపుతూ వచ్చారు.

ఈ క్రమంలోనే అషు రెడ్డి తన మాయాజాలంతో ధర్మేంద్ర ద్వారా కోట్లాది రూపాయల విలువైన ప్లాట్లు, విలాసవంతమైన కార్లు, బంగారు ఆభరణాలను తన పేరు మీదనే కొనుగోలు చేయించుకున్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే కోట్ల రూపాయల నగదు బదిలీ చేయించుకున్నట్లు ధర్మేంద్ర ఆరోపిస్తున్నారు. అయితే 2020లో పెళ్లి ముహూర్తం నిశ్చయమైన కొద్ది రోజులకే అషు రెడ్డి ఎటువంటి కారణం లేకుండా బ్రేకప్ చెప్పి దూరం జరగడంతో ధర్మేంద్ర షాక్‌కు గురయ్యారు. తన ఆస్తులు తిరిగి ఇవ్వాలని కోరగా ఆమె స్పందించలేదు. ఈ వివాదం పరిష్కారానికి టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నటి రంగంలోకి దిగడంతో, కొంత డబ్బు తిరిగి ఇచ్చేందుకు అషు రెడ్డి అంగీకరించినప్పటికీ, చివరకు ఆ నటిని కూడా బురిడీ కొట్టించి డబ్బులు ఎగ్గొట్టినట్లు సమాచారం.

కథ ఇక్కడితో ముగియకుండా, కొంత కాలం తర్వాత అషు రెడ్డి తల్లి యశోద రెడ్డి, సోదరి మళ్లీ ధర్మేంద్రతో టచ్‌లోకి వచ్చారు. అషు తీవ్ర మానసిక వేదనతో ఉందని, ఆమెను కాపాడాలని ధర్మేంద్రను ప్రాధేయపడటంతో ఆయన మళ్లీ ఆమెకు దగ్గరయ్యారు. వీరిద్దరి జాతకాలు కలిశాయని జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పడంతో 2024 అక్టోబర్‌లో పెళ్లి తేదీని ఖరారు చేసుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ అషు రెడ్డి తన తండ్రి, సోదరితో కలిసి ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అషు సోదరి రూ. 50 లక్షలు, తండ్రి రూ. 95 లక్షలు తీసుకోగా, అషు రెడ్డి స్వయంగా రూ. 9 కోట్లు వసూలు చేసినట్లు ధర్మేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పుడైతే ఆయన డబ్బులు ఇవ్వడం ఆపివేశారో, అప్పుడు ఆమె మళ్లీ పెళ్లికి నిరాకరించారు.

అంతటితో ఆగకుండా, తన డబ్బులు అడిగిన ధర్మేంద్రను బెదిరించేందుకు అషు రెడ్డి ఒక హత్య కేసు నిందితుడితో చేతులు కలిపి డ్రామాలు మొదలుపెట్టారు. ఆ నిందితుడితో కలిసి ధర్మేంద్రకు ‘సిట్టింగ్’ వేయించి, ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదంటూ తీవ్రంగా బెదిరింపులకు పాల్పడ్డారు. తనను , తన కుటుంబాన్ని ఆర్థికంగా, మానసిక వేధింపులకు గురిచేస్తూ పథకం ప్రకారం దోచుకున్న అషు రెడ్డి , ఆమె కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మేంద్ర సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ హై ప్రొఫైల్ మోసం కేసు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

Exit mobile version