తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ‘మెయిల్, లెవన్త్ అవర్, కుడిఎడమైతే’ వంటి వెబ్ ఒరిజినల్స్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అన్యాస్ ట్యూటోరియల్’ అనే సరికొత్త వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది ఆహా`. ఇందులో రెజీనా కసండ్ర, నివేదా సతీశ్, అగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ను ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ మూవీని నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆర్కా మీడియా బ్యానర్లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
అన్య అనే పాత్ర చుట్టూ తిరిగే కథతో రూపొందిన సిరీస్ ‘అన్యాస్ ట్యూటోరియల్’. అన్య ఓ పాపులర్ వెబ్ చానెల్ను నడుపుతుంటుంది. ఆమె ఇంట్లో ఆత్మలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు ఆమె జీవితం తలకిందులవుతుంది. ఆమె దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందా లేక తగిన మూల్యం చెల్లించిందా? అనేదే ఇందులోని ప్రధానాంశం. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ, ”ఇప్పటి వరకు ఆహా యాప్ను కోటి మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని సరికొత్త పాత్ బ్రేకింగ్ కంటెంట్ ను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం” అని అన్నారు. దర్శకురాలు పల్లవి గంగిరెడ్డి మాట్లాడుతూ ”ఈ వెబ్ సీరిస్ కథపై నేను, సౌమ్యా శర్మ వర్క్ చేశాం. ఈ ఆలోచనను అల్లు అరవింద్గారు, శోభు యార్లగడ్డగారికి చెప్పినప్పుడు వారికి నచ్చడంతో మా ఆలోచన కార్యరూపం దాల్చింది. త్వరలోనే ఈ కథను ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాం” అని తెలిపింది.
రెజీనా కసండ్ర మాట్లాడుతూ ”నేను పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు ‘కండ నాల్ ముదల్’ అనే సినిమాలో నటించాను. ఆ సినిమాను ప్రియా అనే మహిళా దర్శకురాలు తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగులో నేను చేస్తున్న వెబ్ సిరీస్ దర్శకురాలు, రైటర్ ఇద్దరూ మహిళలే కావడం యాదృచ్చికమే అయినా ఎంతో సంతోషాన్నిస్తోంది. ఆర్కామీడియా సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉంది. ‘అన్యాస్ ట్యూటోరియల్’ అనే కథ విన్నప్పుడు నేనెలా థ్రిల్ అయ్యానో అలాగే ప్రేక్షకులు కూడా అవుతారని భావిస్తున్నాను” అని అన్నారు.
శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ‘మన తెలుగు ఇండస్ట్రీ మీద అల్లు అరవింద్గారు ఎంత పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంటారు. ఆయన ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. ఆహా తెలుగు ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో టాప్గా, లాండ్ మార్క్గా మారింది. ఆహా ద్వారా ఎంతో మంది కొత్త తరం దర్శకులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. సరికొత్త కంటెంట్ను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టమైన విషయం. ఆహాతో అరవింద్గారు దాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఏదో ఒకరోజు నేను, అరవింద్గారు కలిసి ‘బాహుబలి’ రేంజ్ ప్రాజెక్ట్ను రూపొందిస్తాం’ అన్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ వెబ్ సీరిస్ షూటింగ్ అక్టోబర్ తో పూర్తవుతుంది. ఆపైన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిపి, ఏడు ఎపిసోడ్స్ గా దీనిని ఈ యేడాది క్రిస్మస్ వారాంతంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
