లండన్లో దాదాపు రెండు రోజుల పదమూడు గంటల పాటు సంగీతంలోని ఎంతో విశిష్టమైన 72 మేళకర్త రాగాలను పలికించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వంటి అత్యున్నతమైన అవార్డును అందుకున్న ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి. ‘పట్టుకోండి చూద్దాం’, ‘ దేవస్థానం’, ‘మిథునం’ వంటి చక్కని చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఆయన పెద్ద కుమార్తె మారుతీ సాయిలక్ష్మీ వివాహం భాను రాజీవ్తో సోమవారం రాత్రి హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో ప్రముఖ హీరో దగ్గుబాటి వెంకటేశ్ పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. నటులు, దర్శకులు, రచయితలు తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, జనార్థన మహర్షి, సింగర్ రేవంత్, కమెడియన్ శివారెడ్డి తదితరులు పాల్గొని వివాహ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా స్వర వీణాపాణి దంపతులు, వోగోటి వెంకట మారుతీ రామకృష్ణ దంపతులు తమ పిల్లల వివాహ కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు అందించిన ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు.