‘డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్’ అనేది సినిమా వెలుగు చూసిన రోజుల నుంచీ ఉన్న నానుడి. అందువల్ల సినిమా దర్శకునికి ఎంతో క్రమశిక్షణ అవసరం అని పలువురు భావించేవారు. అలాంటివారు తాము దర్శకత్వం చేస్తున్న సమయంలో క్రమశిక్షణతో మెలగడగమే కాదు, కృషి, దీక్ష, పట్టుదలకు చిహ్నంగా ‘యూనిఫామ్’ కూడా ధరించేవారు. తెలుగునాట కొందరు దర్శకులు ఆ పంథాలో పయనించారు. ఎక్కువమంది దర్శకులు వైట్ అండ్ వైట్ వేసుకొనేవారు. కానీ, ‘ఖాకీ’ దుస్తులు అంటే క్రమశిక్షణకు, శ్రమకు ప్రతీక అని భావించిన వారు ఆ యూనిఫామ్ లో కనిపించేవారు. అలా కనిపించిన వారిలో కె.విశ్వనాథ్, కె.బాపయ్య ఉన్నారు. విశ్వనాథ్ కళాత్మక చిత్రాలతో సాగిపోతే, బాపయ్య కమర్షియల్ మూవీస్ తో కనికట్టు చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలిచిన ఘనుడు మన కోవెలముడి బాపయ్య. తెలుగులోనే కాదు హిందీలోనూ విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి భళా అనిపించారు బాపయ్య.
ప్రముఖ దర్శక నిర్మాత కె.ఎస్.ప్రకాశరావు అన్న కుమారుడే బాపయ్య. 1937 ఏప్రిల్ 24న బాపయ్య జన్మించారు. చిన్నతనంలోనే కన్నవారిని కోల్పోయిన బాపయ్యకు బాబాయే నాన్నలా చూసుకున్నారు. తన కొడుకులు కె.రాఘవేంద్రరావు, కృష్ణమోహనరావు, కె.ఎస్. ప్రకాశ్ తో సమానంగా బాపయ్యను పెంచి పెద్ద చేశారు ప్రకాశరావు. తన పినతండ్రి వద్ద పలు చిత్రాలకు తమ్ముడు కె.రాఘవేంద్రరావుతో కలసి అసోసియేట్ గా పనిచేశారు బాపయ్య. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే బాపయ్యలోని పట్టుదల చూసిన రామానాయుడు ఆయనను దర్శకునిగా పరిచయం చేశారు. కె.బాపయ్య దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘ద్రోహి’. జగ్గయ్య కథానాయకునిగా రూపొందిన ‘ద్రోహి’ అంతగా అలరించలేకపోయినా, దర్శకునిగా బాపయ్యకు మంచిపేరు లభించింది.
‘ద్రోహి’ పరాజయంతో మరో మూడేళ్ళ వరకు బాపయ్య సినిమా రాలేదు. కృష్ణంరాజు హీరోగా ‘మేమూ మనుషులమే’ చిత్రం బాపయ్య రెండో చిత్రంగా వచ్చింది. అది కూడా అంతగా అలరించలేకపోయింది. అప్పటికే ‘ఊర్వశి’గా జేజేలు అందుకుంటున్న శారదతో అదే టైటిల్ గాపెట్టి మూడో సినిమా తీశారు బాపయ్య. తెలుగు చిత్రం ‘ఊర్వశి’లో హిందీ అగ్రశ్రేణి నటుడైన సంజీవ్ కుమార్ ను నటింప చేశారు. షరా మామూలే అన్నట్టు ఇదీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే దర్శకునిగానూ, పాటల చిత్రీకరణలోనూ బాపయ్యకు మంచి అభిరుచి ఉందన్న పేరు లభించింది. అదే సమయంలో యన్టీఆర్ చేతుల మీదుగా ‘వైజయంతీ మూవీస్’ను ఆరంభించిన అశ్వనీదత్ ఆయన హీరోగా తీసే చిత్రానికి కె.బాపయ్యను దర్శకునిగా ఎంచుకున్నారు. బాపయ్యతో తొలి సినిమా తీసిన డి.రామానాయుడు కూడా తన ‘సోగ్గాడు’ సినిమాకు మళ్ళీ బాపయ్యనే దర్శకునిగా నిర్ణయించారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ దాదాపు ఒకేసారి ఆరంభమై ఒకేసారి పూర్తయ్యాయి. 1975 డిసెంబర్ 12న యన్టీఆర్ తో బాపయ్య తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఎదురులేని మనిషి’ విడుదలయింది. యన్టీఆర్ ను కొత్తగా చూపించాలన్న తపనతో ఆయనకు వరైటీ కాస్ట్యూమ్స్ ధరింప చేశారు బాపయ్య. అలాగే పాటలలో కాసింత మసాలా కూడా దట్టించారు. ‘ఎదురులేని మనిషి’ ఆ రోజుల్లో వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ సినిమా మొదటివారం కలెక్షన్స్ చూసి సినీజనం నివ్వెర పోయారు. ఈ చిత్రంతో ఒక్కసారిగా బాపయ్య పేరు చిత్రసీమలో మారుమోగి పోయింది. తరువాత వారానికే అంటే 1975 డిసెంబర్ 19న బాపయ్య, శోభన్ బాబు తొలి కాంబినేషన్ గా ‘సోగ్గాడు’ విడుదలయింది. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. వరుసగా మూడు చిత్రాలతో అంతగా ఆకట్టుకోలేకపోయిన బాపయ్య, వారం గ్యాప్ లో రెండు బిగ్ హిట్స్ తో జనాన్ని మురిపించారు. దాంతో దర్శకునిగా కె.బాపయ్య పేరు మారు మోగి పోయింది.
బాపయ్య తెలుగులో యన్టీఆర్ తో ఆరు చిత్రాలు తెరకెక్కించగా, శోభన్ బాబుతో ఆరు, కృష్ణతో ఎనిమిది సినిమాలు రూపొందించారు. తన తొలి చిత్రంలో కీలక పాత్ర పోషించిన కృష్ణంరాజుతోనూ మూడు చిత్రాలు తెరకెక్కించారు. చిరంజీవి హీరోగా బాపయ్య దర్శకత్వంలో ‘ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం’ రూపొందాయి. ఏయన్నార్ తో ‘గురుశిష్యులు’ ఒక్కటే తెరకెక్కించారు. అందులోనూ కృష్ణ మరో హీరోగా నటించారు. కృష్ణ, శోభన్ తో బాపయ్య రూపొందించిన మల్టీస్టారర్స్ ‘మండే గుండెలు, ముందడుగు’ రెండూ మంచి విజయాలను చూశాయి. తెలుగుతో పాటే హిందీ చిత్రసీమలోనూ బాపయ్య తనదైన బాణీ పలికించారు. బాపయ్యను హిందీ చిత్రసీమకు పరిచయం చేసింది ‘సోగ్గాడు’ నిర్మాత డి.రామానాయుడే కావడం విశేషం. ‘సోగ్గాడు’ రీమేక్ గా ‘దిల్ దార్’ తెరకెక్కించి హిందీ వారిని అలరించారు బాపయ్య. తెలుగులో కంటే హిందీలోనే బాపయ్యకు సక్సెస్ రేటు బాగుంది. తెలుగులో విజయం సాధించిన పలు చిత్రాలను బాపయ్య హిందీలో రీమేక్ చేయడం విశేషం. యన్టీఆర్ ‘ఎదురులేని మనిషి’తో డైరెక్టర్ గా ఫస్ట్ సక్సెస్ చూసిన బాపయ్య ఆయన రాజకీయ ప్రవేశం చేశాక ‘నాదేశం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అది కూడా మంచి ఆదరణ పొందింది. ఆ పై తెలుగు, హిందీ భాషల్లో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు బాపయ్య.
