NTV Telugu Site icon

ఈ టైమ్‌లో నరేష్ అట్లా మాట్లాడం కరెక్ట్ కాదు: బండ్ల గణేష్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ప్రమాదానికి గురైయ్యారు. దీంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. అయితే సాయి తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా.. వైద్యానికి ఆయన స్పందిస్తున్నాడు అంటూ వైద్యులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులతో పాటుగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ తెలిపారు.

తేజూ ప్రమాదం గురించి తెలిసి మెగా కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అపోలో హాస్పిటల్‌కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొంత మంది తేజూ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ప్రార్థనలు చేశారు. మరోవైపు, తేజూ ప్రమాదంపై స్పందించిన సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నటుడు నరేష్ స్పందిస్తూ.. బైక్ రైడింగ్ విషయంలో తన కొడుకుని, సాయి ధరమ్ తేజ్‌‌ని చాలా సార్లు హెచ్చరించానని ఆయన అన్నారు. తన కుమారుడు, తేజూ మంచి స్నేహితులని.. తేజూ తనకు బిడ్డ లాంటివాడని చెప్పారు. శుక్రవారం సాయంత్రం తన ఇంటి నుంచే సాయి ధరమ్ తేజ్ బయలుదేరి వెళ్లాడని తెలిపారు. బైక్స్ వేగంగా నడపవద్దని నాలుగు రోజుల క్రితం ఇద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇద్దాం అనుకున్నానని.. ఇంతలోనే తేజూకి యాక్సిడెంట్ అయ్యిందన్నారు. తేజూ త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

అయితే, తాజాగా దీనిపై మెగా వీరాభిమాని, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. ‘సాయి ధరమ్ తేజ్ గారు త్వరలోనే షూటింగ్ లు చేస్తారు.. బ్రహ్మాండంగా ఉంటారు, చిన్న ప్రమాదం జరిగింది. ఈ టైమ్ లో నరేష్ గారు.. మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తు మరణించిన వారి పేర్లు చెప్పడం గాని, మీరు అట్లా మాట్లాడటం గాని కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకు సార్..? రేసింగ్ చేశాడు.. అది, ఇది చేశాడు.. మీ ఇంటి దగ్గరకి వచ్చాడని.. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు సార్.. అంటూ బండ్ల వీడియో ద్వారా తెలియజేశారు. ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుడిని ప్రార్ధించి, త్వరగా కోలుకోవాలని హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి గాని, అవన్నీ ఇప్పుడు ఎందుకు..? అంటూ బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.