భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా మహోత్సవ్’ పేరుతో వివిధ రంగాలలో పలు కార్యక్రమాలు జరుపుతున్నారు. అందులో భాగంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ రీజన్) సైతం ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఏప్రిల్ 9, 10 తేదీలలో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను జరుపుతోంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేస్తారు.
Read Also : KGFVerse : రాఖీభాయ్ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి రెడీనా ?
దేశం గర్వించే సినీ రంగ కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ సమావేశాలలో పాల్గొనబోతున్నారు. మణిరత్నం, ఎ. ఆర్. రెహ్మాన్, తాప్సీ, ‘జయం’ రవి, శివరాజ్ కుమార్, ఫహద్ ఫాజిల్, సాబు శిరిల్, కార్తీక్ సుబ్బరాజు, పవన్ కుమార్, రీమా కళింగల్ తదితరులు ఈ సమ్మిట్ కు హాజరవుతున్నారు. తెలుగు నుండి రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో పాల్గొనబోతున్నారు. పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దక్షిణాది చిత్రసీమకు సంబంధించిన కీలక విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. అలానే ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఓటీటీ రంగాల ప్రభావం సినిమా రంగం మీద ఎలా ఉందనే దానిపై కూడా విస్తృత స్థాయిలో చర్చింబోతున్నారు. సినిమా రంగ ప్రముఖులతో పాటు మీడియా సంస్థల ప్రతినిధులు సైతం ఈ సమావేశాలకు హాజరవుతున్నారు.