అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం కంధాలపల్లిలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లే సమయంలో స్థానికులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో రోడ్డుకు అడ్డంగా పెళ్లి పందిరి ఏర్పాటు చేయడంతో.. మృతదేహాన్ని ఆ మార్గంలో తీసుకెళ్లొద్దని కొందరు నిరోధించారు. బదులుగా బురదతో నిండిన రహదారి, పంట పొలాల మార్గం ద్వారా తీసుకెళ్లాలని హెచ్చరించడంతో రెండు సామాజిక వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో నిర్మించిన రోడ్డుపై ఎస్సీ వర్గాల వారికి అనుమతి ఇవ్వకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరణం తర్వాత కూడా వివక్ష కొనసాగుతుందన్న విమర్శలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. సంప్రదాయబద్ధంగా జరగాల్సిన అంతిమయాత్రలో ఇలాంటి అడ్డంకులు సృష్టించడంపై దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని మాజీ ఎంపీ హర్షకుమార్ సందర్శించి.. బాధితులకు మద్దతు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే ఉద్యమం చేపడతామని హర్ష కుమార్ హెచ్చరించారు. పోలీసులు ఇప్పటికే ఘటనలో పాల్గొన్న 10 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్ట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.