వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకుని, నటిగా ముందుకు సాగే ప్రయత్నం గట్టిగా చేస్తోంది ప్రముఖ కథానాయిక అమలాపాల్. అందుకే గతంలో మాదిరి మరోసారి విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. కేవలం సినిమాలకే పరిమితమై పోకుండా ఆంథాలజీలు, వెబ్ సీరిస్ లకూ సై అంటోంది. ఇప్పటికే తెలుగులో ‘కుడిఎడమైతే’ వెబ్ సీరిస్ చేసిన అమలాపాల్ తాజాగా హిందీలోనూ ఓ వెబ్ సీరిస్ చేసింది. అదే ‘రంజిష్ హీ సహీ’. జనవరి 13 నుండి వూట్ ఓటీటీలో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ సోషల్ మీడియాలో యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్
పుష్పదీప్ భరద్వాజ్ దర్శకత్వంలో మహేశ్ భట్ ఈ వెబ్ సీరిస్ నిర్మించాడు. ఇందులో కథానాయకుడు శంకర్ పాత్రను ’83’ మూవీలో సునీల్ గవాస్కర్ గా నటించిన తాహిర్ రాజ్ బసీన్ పోషిస్తున్నాడు. విశేషం ఏమంటే… ఈ వెబ్ సీరిస్ స్టోరీ యాభై శాతం మహేశ్ భట్ జీవితమే అంటున్నాడు తాహిర్. మిగిలిన సగం ఫిక్షన్ అని చెబుతున్నాడు. ఇందులో అతను దర్శకనిర్మాతగా నటించాడు. భార్య పట్ల విధేయుడిగా ఉండే ఈ దర్శకుడి జీవితంలోకి ఓ పాపులర్ నటి, సింగర్ అడుగుపెట్టడంతో ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ వెబ్ సీరిస్ సారాంశం. దర్శకుడి వైవాహిక జీవితంలో చిచ్చపెట్టే స్టార్ గా అమలాపాల్ నటించింది. పాత్రోచితంగా మద్యం తీసుకోవడం, సిగరెట్ తాగడం, లిప్ లాక్ చేయడం వంటి సన్నివేశాలు ట్రైలర్ లో ఉండటంతో అది కాస్త వైరల్ అయ్యింది. అమలాపాల్ ప్రస్తుత పరిస్థితికి ఆమె పాత్రను అన్వయించుకుని కూడా కొందరు చూస్తున్నారు. అయితే… కేవలం గ్లామర్ షోకు పరిమితం కాకుండా అమలాపాల్ ఆ పాత్ర ద్వారా చక్కని నటన కూడా ప్రదర్శించిందని తెలుస్తోంది. అందులో ఆమె ఏమేరకు సక్సెస్ అయ్యిందనేది ‘రంజిష్ హీ సహీ’ చూస్తే కానీ తెలియదు.