అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’లో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ… ‘డెకాయిట్’ బెంగళూరు సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు కొంతమంది కలిశారు. తమిళనాడుకు చెందిన ఒక లాయర్ కలిసి తనకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాడు. తనను ఎవరో 150 మంది కలిసి కొట్టారట. చాలాకాలం హాస్పిటల్లో ఉన్నాడు. బయటకు రావాలంటే భయమేసిందని, తనకు ధైర్యం ఇచ్చింది ‘మేజర్’ సినిమా అని చెప్పాడు. ‘డెకాయిట్’ రిలీజ్ అవుతుందని తెలుసుకుని హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి మొదటిగా ఈ సినిమానే చూశానని చెప్పాడు. సినిమా చాలా నచ్చిందని, నన్ను కలవడానికి ప్రత్యేకంగా వచ్చానని చెప్పాడు. చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమైంది.. మనము సినిమా, బిజినెస్ గురించి ఆలోచిస్తూ మానవత్వాన్ని ఎక్కడో మర్చిపోతాం. ఆయన నాకు ఆ మానవత్వాన్ని మళ్లీ గుర్తు చేశాడు. నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో గుర్తు చేశాడు. అలాగే ‘మేజర్ సందీప్’ ఫ్యాన్ పేజ్ నిర్వహిస్తున్న వారు ఒక పబ్లిక్ ఫంక్షన్లో పెట్టుకోమని నాకు ఇండియన్ ఫ్లాగ్ ఇచ్చారు. ఇంత ప్రేమను ప్రేక్షకులు, మీడియా నుంచి పొందుతున్నప్పుడు.. ఇదే క్రెడిబిలిటీ అనిపిస్తుంది. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అందుకే నాకు ‘గుడ్ సినిమా’ శేష్ అనే ట్యాగ్ రావాలని కోరుకున్నాను. అలాంటి సంతృప్తి ఈ సినిమా ఇచ్చింది. ఆ బెంగళూరులో ఆ లాయర్ ని కలిసినప్పుడు వచ్చిన అనుభూతి నాకు ఒక షీల్డ్లా అనిపించింది అన్నారు.
