నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మే 12న భోపాల్లో ట్విషా ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆమె అంత్యక్రియలు జరగలేదు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని భోపాల్లోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదంటూ కుటుంబ సభ్యులు, లాయర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మార్చురీలో ఉన్న ట్విషా మృతదేహం కుళ్ళి పోతోందని ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మృతదేహాన్ని వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని కోరుతూ ట్విషా కుటుంబ సభ్యులకు పోలీసులు అధికారికంగా ఒక లేఖ పంపారు.
కోర్టు ఆదేశిస్తే రెండోసారి పోస్టుమార్టం నిర్వహించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ ప్రక్రియకు తాము పూర్తిగా సహకరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసు విచారణలో దర్యాప్తు సంస్థల తీరుపై ట్విషా తరపు న్యాయవాది అంకుర్ పాండే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసును తప్పుదోవ పట్టించేలా, నిందితులకు అనుకూలంగా మార్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్విషా మెడపై ఉన్న స్పష్టమైన గాయాల గురించి ఎయిమ్స్ వైద్యులు ఎందుకు సరైన వివరాలు సేకరించలేదని లాయర్ అంకుర్ ప్రశ్నించారు. మరణానికి ముందు ఆ గాయాలు ఎలా అయ్యాయన్న అసలు నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మృతదేహాన్ని ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచేందుకు తగిన సాంకేతిక వసతులు తమ వద్ద లేవని భోపాల్ ఎయిమ్స్ యాజమాన్యం అంగీకరించినట్లు లాయర్ తెలిపారు. నిందితుల ప్రమేయం వల్లే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పోస్టుమార్టం రికార్డుల్లో ట్విషా ఎత్తు విషయంలో నమోదైన వివరాలు కేసుపై మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
