గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, బిహార్ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గడం కొంత ఊరటనిస్తోంది. రికవరీ రేటు కూడా పెరగడంతో కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశకు వచ్చినట్లుగా అంతా భావిస్తున్నారు. అయితే కరోనా మరణాల విషయంలో చాలా రాష్ట్రాలు నిజాలు దాస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా టెస్టులు కూడా తక్కువగా చేయడం మొదలుపెట్టారు. మరికొన్ని రాష్ట్రాల్లో రోజువారీ కేసులు మారుతూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో అప్పుడే సెకండ్ వేవ్ కి ముగింపు పలికినట్టు కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత ఓ అంచనాకు రావొచ్చని అభిప్రాయపడుతున్నారు.