Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heatwave : ఐదు రోజుల పాటు వీచే తీవ్ర వడగాలుల ప్రభావంతో దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది అదనంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ మరణాల్లో అధిక భాగం దేశంలోని అత్యంత పేద, అత్యంత వేడిగల రాష్ట్రాల్లోనే నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్క్లే క్యాంపస్కు చెందిన ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ పరిశోధకులు పీయూష్ నారంగ్, అశోక్ గాడ్గిల్ నిర్వహించారు. వాళ్ళ అంచనాల ప్రకారం ఒక్క రోజు అత్యంత తీవ్రమైన ఎండలు నమోదైనా దేశవ్యాప్తంగా సుమారు 3,400 అదనపు మరణాలు సంభవించవచ్చు. ఐదు రోజుల పాటు వడగాలులు కొనసాగితే ఈ సంఖ్య 30 వేల మార్క్కు చేరువ కావచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ అంచనాలు అధికారిక గణాంకాలతో పోలిస్తే భారీ వ్యత్యాసాన్ని చూపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2023 మార్చి నుంచి జూలై మధ్య దేశవ్యాప్తంగా హీట్ స్ట్రోక్ కారణంగా సుమారు 360 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. అయితే వార్తా కథనాలను విశ్లేషించిన కొన్ని స్వతంత్ర సంస్థలు 733 మరణాలను గుర్తించాయి. అసలు సమస్య ఏంటంటే వేడి కారణంగా మరణించిన చాలా మంది మరణ ధ్రువీకరణ పత్రాల్లో హార్ట్ అటాక్, కిడ్నీ వైఫల్యం, వృద్ధాప్యం వంటి కారణాలే నమోదవుతాయి. అందువల్ల ఎండల అసలు ప్రభావం అధికారిక లెక్కల్లో కనిపించదని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
ఈ అధ్యయనంలో దేశంలోని 10 నగరాల్లో ఇప్పటికే గుర్తించిన వేడి మరణాల ప్రమాద స్థాయిలను ఆధారంగా తీసుకుని మొత్తం 765 జిల్లాలలో అధ్యయనం చేశారు. ఒకే వాతావరణ మండలిలో ఉన్న జిల్లాలను సంబంధిత నగరాలతో పోల్చి విశ్లేషించారు. ఈ విధంగా జిల్లా స్థాయిలో దేశవ్యాప్తంగా వేడి మరణాల ప్రమాదాన్ని అంచనా వేయడం ఇదే తొలిసారి అని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ ప్రమాదం దేశమంతా సమానంగా విస్తరించలేదని అధ్యయనం వెల్లడించింది. ఐదు రోజుల వడగాలుల సమయంలో ఒక్క ఉత్తరప్రదేశ్లోనే సుమారు 8,056 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉంది. బీహార్లో 3,600, మధ్యప్రదేశ్లో 2,960, రాజస్థాన్లో 2,660, గుజరాత్లో 2,350 మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఐదు రాష్ట్రాలు కలిపి దేశవ్యాప్తంగా సంభవించే అదనపు మరణాల్లో దాదాపు 66 శాతం వాటాను కలిగి ఉంటాయి.
జిల్లాల వారీగా చూస్తే గుజరాత్లోని అహ్మదాబాద్ అత్యంత ప్రమాదకర ప్రాంతంగా నిలిచింది. ఒక్క ఐదు రోజుల వడగాలుల సమయంలో అక్కడ సుమారు 307 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. జైపూర్లో 265, సూరత్లో 261 మరణాలు నమోదయ్యే ప్రమాదం ఉంది. ప్రయాగ్రాజ్, పాట్నా, లక్నో, కాన్పూర్ నగర్ జిల్లాల్లో కూడా 190కు పైగా అదనపు మరణాలు సంభవించవచ్చని అంచనా వేశారు.
ఈ అధ్యయనం మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అత్యధిక ప్రభావం ఎదుర్కొనే ఈ ఐదు రాష్ట్రాల్లో దేశ జనాభాలో 43 శాతం మంది నివసిస్తున్నప్పటికీ, దేశ జీడీపీలో వాటి వాటా కేవలం 29 శాతం మాత్రమే. అంటే ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలపైనే వేడి విపత్తు మరింత తీవ్రంగా పడుతోంది. శీతలీకరణ కేంద్రాలు, తాగునీటి సౌకర్యాలు, వైద్య వసతులు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి తక్కువ వనరులు ఉన్న రాష్ట్రాలే ఎక్కువ ప్రాణనష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది.
2010లో ఘోర వడగాలుల తర్వాత అహ్మదాబాద్ రూపొందించిన హీట్ యాక్షన్ ప్లాన్ దేశానికి ఆదర్శంగా మారింది. అయితే ఇప్పటివరకు ఎక్కువ చర్యలు ప్రధానంగా నగరాలకే పరిమితమయ్యాయని పరిశోధకులు అంటున్నారు. అసలు ప్రమాదం ఎక్కువగా ఉన్న గ్రామీణ, తక్కువ ఆదాయ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వాళ్ళు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను జనాభా ఆధారంగా కాకుండా, ప్రమాద తీవ్రత, ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకుని కేటాయించాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.
అయితే ఈ అంచనాలు ఖచ్చితమైన మరణాల లెక్కలు కాదని పరిశోధకులే స్పష్టం చేస్తున్నారు. ఇవి గణాంక నమూనాల ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమే. అంతేకాకుండా 2008 నుంచి 2019 మధ్యకాల డేటాను ఆధారంగా తీసుకున్నారు. 2023, 2024లో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల ఇవి కనీస అంచనాలుగా చూడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో వడగాలులు మరింత కాలం సాగినా ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
-
Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న ‘మండాడి’ డైరెక్టర్!
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..