Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!

Ragi Payasam

Ragi Payasam

Ragi Semiya Payasam: రాగితో ఇడ్లీ, దోసె, జావ, పొంగనాలంటూ వివిధ రకాల రెసిపీలు ప్రిపేర్ చేస్తుంటారు. ఇందులో పాయసం కూడా ఒకటి. రాగిపిండితో సేమియా కలిపి ఇలా కమ్మని పాయసం చేశారంటే ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు. బిగినర్స్ కూడా ఈ పద్ధతిలో సింపుల్​గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే పిల్లలైతే ఒకటికి రెండు గ్లాసులు ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధి ఉంటాయి. సాధారణ మైదా లేదా తెల్ల సేమియాతో పోలిస్తే, రాగి పాయసం శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా బరువు పెరగకుండా కాపాడుతుంది. రాగులలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా అందిస్తుంది. ఇలాంటి పోషకాలు ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

నెయ్యి:1 టీస్పూన్
రాగి సేమియా: 250 గ్రాములు
నీళ్ళు: 500 మి.లీ
పాలు: 1 లీటరు
యాలకుల పొడి: 1 టీస్పూన్
జాజికాయ పొడి: చిటికెడు
చిక్కటి/పలచటి కొబ్బరి పాలు: 500 మి.లీ
పాలు/సక్కెర (చక్కెర): 1/2 కప్పు
ఉప్పు:1/2 టీస్పూన్

గార్నిషింగ్ కోసం:

నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు:4 టేబుల్ స్పూన్లు
కిస్మిస్: 2 టేబుల్ స్పూన్లు

తయారుచేసే విధానం:

ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో టీస్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక, రాగి సేమియా వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు దోరగా వేయించాలి. అందులో 500 మి.లీ నీళ్ళు పోసి, రాగి సేమియా నీటిని పూర్తిగా పీల్చుకునే వరకు ఉడికించాలి. ఇప్పుడు పాలు, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. పాలు బాగా మరిగేంత వరకు ఉంచాలి. మంట తగ్గించి 15 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు కలిపి, మరొక పొంగు వచ్చే వరకు ఉంచాలి. పాయసం మెల్లగా చిక్కబడుతుంది. ఇప్పుడు పంచదార, చిటికెడు ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి. చిన్న మూకుడులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలను వేయించాలి. చివరిగా కిస్మిస్ వేసి అవి ఉబ్బే వరకు వేయించి పాయసంలో కలపాలి. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి సేమియా పాయసాన్ని వేడిగా అయినా లేదా చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు!