Instant Ragi Idli Recipe: పొద్దున లేవగానే రుచికరమైన, ఆరోగ్యకరమైన టిఫిన్ తయారు చేసి ఇంటిల్లిపాదికీ పెట్టాలని ఇల్లాలు కోరుకుంటుంది. ఇదే ఇంట్లో ఒక వేళ షుగర్ పేషెంట్స్ ఉంటే అల్పాహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అందుకే.. షుగర్ పేషెంట్స్తో పాటు ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం, టేస్టీ టేస్టీ టిఫిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా షుగర్ ఉన్నవాళ్లకు ఏం టిఫిన్ తినాలి అన్న ప్రశ్న మొదలవుతుంది. ఎక్కువ నూనె, మైదా, చక్కెర లాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాంటి సమయంలో రాగి ఇడ్లీ ఒక చక్కని పరిష్కారం. ఇది ఆరోగ్యంగా ఉండటమే కాదు, పొట్ట నిండుగా ఉండేలా చేసి ఎక్కువసేపు శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా ఉదయం హడావుడిగా ఆఫీసు, పనులకి వెళ్లే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
READ MORE: Planes Collide: ఢీకొన్న ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు.. ముంబైలో తప్పిన పెను ప్రమాదం..
రాగి ఇడ్లీ రెండు రకాలుగా చేస్తారు. ఒకటి రాగి గింజలు, మినపప్పు నానబెట్టి రుబ్బి పిండిగా చేసి, కాస్త ఫెర్మెంట్ అయ్యాక ఇడ్లీలు వేయడం. ఇది టైం తీసుకుంటుంది. ఇంకోది ఈ ఇన్స్టంట్ రాగి ఇడ్లీ. ఇందులో రాగి పిండి, రవ్వ, పెరుగు వాడతారు. అరగంటలోనే ఇడ్లీలు సిద్ధం అవుతాయి. షుగర్ పేషెంట్స్కి, వర్కింగ్ లేడీస్కి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ రాగి ఇడ్లీకి కూరగాయలు కలిపితే ఇంకా పోషక విలువ పెరుగుతుంది. సాధారణంగా క్యారెట్ తురుము వేస్తారు. కానీ షుగర్ ఉన్నవాళ్లకు సొరకాయ, బూడిద గుమ్మడికాయ, బీట్రూట్, దోసకాయ లాంటివి బాగా ఉపయోగపడతాయి. ఇవి రాగి రుచిని మార్చకుండా, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. రాగి రుచి కొత్తగా అనిపించే వాళ్లు మొదట క్యారెట్ లేదా దోసకాయ కలిపి చేసుకుంటే అలవాటు అవుతుంది.
READ MORE: Megna Mukharjee: సౌరవ్ గంగూలీతో యాడ్లో నటించి.. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ!
ఇన్స్టంట్ రాగి ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా పాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కాజూ ఉంటే వేయాలి. తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. దాని తర్వాత రవ్వ వేసి రెండు నిమిషాలు వేయించాలి. రవ్వ వాసన వచ్చిన తర్వాత రాగి పిండి వేసి మూడున్నర నాలుగు నిమిషాలు మెల్లగా వేయించాలి. అనంతరం మంట ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఉప్పు, కొత్తిమీర, తురుమిన క్యారెట్ లేదా మీరు ఎంచుకున్న కూరగాయలు వేయాలి. ఇప్పుడు పెరుగు, నీళ్లు వేసి ముద్దలు లేకుండా బాగా కలపాలి. ఈ పిండిని మూత పెట్టి కనీసం పది నిమిషాలు ఉంచాలి. అప్పటికి రాగి, రవ్వ నీటిని పీల్చుకుని పిండి గట్టిగా అవుతుంది. అప్పుడు కాస్త పెరుగు లేదా రెండు స్పూన్లు నీళ్లు వేసి, ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. చివరగా చిటికెడు బేకింగ్ సోడా కలిపితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి, పిండిని పోసి స్టీమర్లో పెట్టాలి. పది నుంచి పన్నెండు నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే మూత పెట్టి వెయిట్ వేయకుండా ఉడికించాలి. స్టవ్ ఆపిన తర్వాత ఐదు నిమిషాలు ఆగి ఇడ్లీలు తీస్తే విరగవు. ప్లేట్ అడుగున చల్లని నీళ్లు చల్లితే ఇడ్లీలు సులువుగా బయటకు వస్తాయి. ఇక ఈ రాగి ఇడ్లీలు వేడిగా ఉన్నప్పుడే తింటే రుచి బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ సాంబార్, బాంబే సాగు, టమాట చట్నీ లాంటి కారంగా ఉండే సైడ్ డిష్లతో ఇవి బాగా సరిపోతాయి. ఉల్లిపాయ చట్నీ, గుమ్మడికాయ చట్నీ, గోరుచిక్కుడు కారం చట్నీ కూడా మంచి జోడీ. కొబ్బరి చట్నీ మాత్రం ఈ రాగి ఇడ్లీకి అంతగా సరిపోదు.
READ MORE: Rahul Gandhi: “కావాలనే నన్ను మాట్లాడనివ్వడం లేదు”.. స్పీకర్కు రాహుల్ గాంధీ లేఖ..
షుగర్ ఉన్నవాళ్లకి రాగి ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఇడ్లీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ తో పాటు కాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఉన్నాయి. రాగి జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి, ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగవు. బరువు తగ్గాలనుకునే వాళ్లకూ ఇది సహాయపడుతుంది. అయితే ఒక భోజనానికి ఒకే ధాన్యం తీసుకోవడం మంచిది. అప్పుడే రాగి ప్రయోజనం పూర్తిగా అందుతుంది.