Crispy Veggie Fingers: ఇంట్లో పిల్లలు ఉంటే వారికి రోజూ కూరగాయలు, పప్పులు తినిపించడం పెద్ద సవాలుగా మారుతుంది. అలాంటి సమయంలో ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే బయట దొరికే స్నాక్స్లా ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే శనగపప్పు, బియ్యం ఫింగర్స్ తయారుచేయవచ్చు. అదేనండి.. ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ అనమాట. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ స్నాక్ పిల్లల లంచ్ బాక్స్కే కాకుండా, పెద్దల సాయంత్రం టీ టైమ్కు కూడా పనికి వస్తాయి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా..
కావాల్సిన పదార్థాలు:
* బియ్యం: 1 కప్పు
* శనగపప్పు: ½ కప్పు
* ఉడికించిన బంగాళాదుంపలు: 2
* పచ్చిమిర్చి: 2
* అల్లం తరుగు: 1 టీస్పూన్
* కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు
* జీలకర్ర: ½ టీస్పూన్
* కారం పొడి: ½ టీస్పూన్
* చాట్ మసాలా: ½ టీస్పూన్
* గరం మసాలా: ¼ టీస్పూన్
* నిమ్మరసం: 1 టీస్పూన్
* బ్రెడ్ పొడి: ½ కప్పు
* ఉప్పు: రుచికి సరిపడా
* నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా బియ్యం, శనగపప్పును శుభ్రంగా కడిగి 5 గంటల పాటు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టాలి. నానిన బియ్యం, శనగపప్పులను పచ్చిమిర్చి, అల్లంతో కలిపి మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా (కోర్స్గా) రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక కడాయిలో వేసి సన్నని మంటపై కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడి పిండి ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వండి.
పిండి చల్లారిన తర్వాత అందులో ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, కొత్తిమీర, జీలకర్ర, కారం, చాట్ మసాలా, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండిని పొడవాటి ఫింగర్స్ ఆకారంలో రూపొందించండి. ఆ తర్వాత వీటిని బ్రెడ్ పొడిలో అటుఇటు ముంచి అంతటా సమానంగా కోటింగ్ వచ్చేలా చేయండి. కడాయిలో నూనె వేడి చేసి, మీడియం మంటపై ఈ ఫింగర్స్ను బంగారు రంగు వచ్చేవరకు కరకరలాడేలా వేయించి టిష్యూ పేపర్పైకి తీసుకోండి. ఈ వేడివేడి శనగపప్పు-బియ్యం ఫింగర్స్ను టొమాటో సాస్, పుదీనా చట్నీ లేదా చింతపండు చట్నీతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటాయి. అంతే సింపుల్.. ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ రెడీ..
ముఖ్యమైన చిట్కా:
పిండి మిశ్రమాన్ని కడాయిలో ఉడికించేటప్పుడు అది చక్కగా దగ్గరపడే వరకు కలపాలి. మిశ్రమం పల్చగా ఉంటే ఫింగర్స్ ఆకారం రాకపోవడమే కాకుండా, నూనెలో వేయించేటప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంది.

