JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కబరిచారు. బీఈ/బీటెక్ పేపర్కు సంబంధించిన సెషన్-1 ఫలితాలు విడుదల కావడంతో మొత్తం సుమారు 13 లక్షల మంది అభ్యర్థుల్లో 12 మంది 100 పర్సెంటైల్ సాధించగా, వారిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండటం సంచలనంగా మారింది. ఏపీకి చెందిన ఇద్దరు, తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఈ ఫలితాల్లో 100 పర్సెంటైల్ సాధించారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన నరేంద్రబాబు గారి మహిత్(NARENDRABABU GARI MAHITH), పసల మోహిత్(PASALA MOHITH) తెలంగాణకు చెందిన వివాన్ శరద్ మహిశ్వరి(VIVAN SHARAD MAHISWARI) సత్తా చాటారు.
READ MORE: Loot Deal: సరికొత్త ‘ఓపెన్ ఇయర్’ బడ్స్.. జిమ్, రన్నింగ్కు బెస్ట్ ఆప్షన్.!
దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోని పరీక్షా కేంద్రాలు కలిపి మొత్తం 326 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ ఎగ్జామ్ను 13 భాషల్లో రాయడానికి అవకాశం కల్పించారు. జనవరి 21 నుంచి 29 వరకు సెషన్-1 పరీక్షలు జరిగాయి. ప్రతి రోజు రెండు షిఫ్టులుగా పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు మరో షిఫ్ట్ జరిగింది. బీఈ/బీటెక్ పేపర్ మాత్రం జనవరి 21 నుంచి 28 మధ్య నిర్వహించారు. ఈసారి ప్రశ్నాపత్రం మొత్తం చూసుకుంటే మోస్తరు కఠినతరంగా ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. కొన్ని షిఫ్టుల్లో ఫిజిక్స్ కాస్త కఠినంగా ఉండగా, మరికొన్ని షిఫ్టుల్లో మ్యాథ్స్ ఎక్కువ సమయం తీసుకున్నట్టు చెప్పారు. కెమిస్ట్రీ మాత్రం చాలామందికి స్కోరింగ్ సబ్జెక్ట్గా మారింది. 100 పర్సెంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రతిభ చాటడంతో పాఠశాలలు, తల్లిదండ్రులు గర్వంగా భావిస్తున్నారు. కష్టపడి సిద్ధమైతే జాతీయ స్థాయి పరీక్షల్లోనూ అగ్రస్థానాలు సాధించవచ్చని వారు నిరూపించారు.