Bangladesh: భారత వ్యతిరేకి, రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య బంగ్లాదేశ్ను అట్టుడికేలా చేస్తోంది. డిసెంబర్ 12న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చారు, మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఎయిర్ అంబులెన్స్ ద్వారా అతడిని సింగపూర్కు మెరుగైన వైద్యం కోసం తరలించింది. డిసెంబర్ 19న అతను చికిత్స తీసుకుంటూ మరణించాడు. అయితే, ఇతడి మరణం బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలకు కారణమైంది. ఢాకాలో పలు మీడియా సంస్థలపై దాడులు చేయడంతో పాటు, షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలపై దాడులకు తెగబడ్డారు. మైమన్సింగ్ జిల్లాలో దైవదూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక హిందువును దారుణం కొట్టి, చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హదీ హంతకుల్లో ఒకరిగా భావిస్తున్న ప్రధాన నిందితుడు ఫైసల్ కరీం, తన గర్ల్ఫ్రెండ్తో ఈ హత్య గురించి పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. కాల్పులకు ముందు రోజు రాత్రి ఢాకాలోని ఒక రిసార్ట్లో బస చేసిన ఫైసల్, తన గర్ల్ ఫ్రెండ్ మరియా అక్తర్ లిమాతో ‘‘మొత్తం బంగ్లాదేశ్ షేక్ అయ్యే ఘటన’’ జరగబోతోందని చెప్పాడు. అతను మరియాకు హదీకి సంబంధించిన ఒక క్లిప్ కూడా చూపించాడని అక్కడి మీడియా నివేదించింది. ‘‘రేపు (శుక్రవారం) ఏదో జరగబోతోంది, దానితో దేశం మొత్తం వణికిపోతుంది’’ అని అక్కడ డైటీ జుగాంతర్ పత్రిక చెప్పింది. ఈ కేసులో మరియాతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఫైసల్కు సాహెదా పర్వీన్ సామియా అనే మహిళతో వివాహం జరిగింది. ఆమెతో పాటు అతడి కుటుంబ సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
పక్కా ప్రణాళికతోనే హదీ హత్య:
షరీఫ్ ఉస్మాన్ హదీని పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో ఇందులో ఒక మాజీ కౌన్సిలర్పై అనుమానం ఉన్నట్లు తేలింది. నిధుల సమీకరణ, ఆయుధాల సేకరణ, దాడి, పారిపోయేందుకు సహకరించడంలో మొత్తం 20 మంది వ్యక్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశారు. ఫైసల్ సోదరి నివాసంలో కాల్పులకు ఉపయోగించిన మ్యాగజైన్, 11 రౌండ్ల మందుగుండు సామాగ్రి లభించింది. ఢాకా సమీపంలోని ఒక చెరువులో రెండు విదేశీ పిస్టల్లు, రెండు మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు.
కాల్పుల సమయంలో ఉపయోగించిన మోటార్ సైకిల్ నకిలీ నెంబర్ ప్లేట్ ఉపయోగించినట్లు తెలిసింది. పట్టుబడకుండా ఉండేందుకు ఫైసల్ తండ్రి నెంబర్ ప్లేట్లను మార్చినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితులు ఫైసల్, అతడి సహాయకులు భారత్ పారిపోయినట్లు అక్కడి మీడియా నివేదిస్తోంది. అయితే, భారత్ వెళ్లారనే దానికి ఆధారాలే లేవని ఢాకా పోలీసులు చెబుతున్నారు.