పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఘర్షణ తాజాగా కొత్త మలుపు తిరిగింది. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేసినట్లు ప్రకటించింది. అనంతరం ప్రతిస్పందన చర్యగా ఇరాన్కు చెందిన తీరప్రాంత నిఘా రాడార్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం, హోర్ముజ్ జలసంధి వైపు ప్రయాణిస్తున్న నాలుగు ఇరాన్ డ్రోన్లు సముద్ర రవాణాకు ముప్పుగా మారే అవకాశం ఉండటంతో వాటిని గాల్లోనే ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులను నివారించేందుకు భద్రతా చర్యల్లో భాగంగా ఇరాన్ తీర ప్రాంతంలోని పలు రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒక ద్వీపంలో ఉన్న నిఘా కేంద్రం కూడా ఈ దాడుల్లో లక్ష్యంగా మారినట్లు తెలుస్తోంది.
కువైట్ విమానాశ్రయ ఘటన తర్వాత తాజా పరిణామం
ఈ వారం ప్రారంభంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడి ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఆ ఘటనలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. దీంతో విమానాశ్రయ కార్యకలాపాలు కొంతకాలం పాటు నిలిపివేయాల్సి వచ్చింది.
ట్రంప్ వ్యాఖ్యలు
పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. విస్కాన్సిన్లో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్తో పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని పేర్కొన్నారు. చర్చల ద్వారానైనా, అవసరమైతే కఠిన చర్యల ద్వారానైనా ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు. ఇరాన్-అమెరికా మధ్య తాజా పరిణామాలు పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయ ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.

