TikTok: భారత్ జాడలోనే అమెరికా నడిచింది. చైనాకు షాక్ ఇస్తూ ప్రముఖ వీడియో ప్లాట్ఫారం టిక్ టాక్కి వ్యతిరేకం బిల్ని ఆమోదించింది. యూఎస్ ప్రతినిధుల సభ భారీ మెజారిటీతో బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. టిక్ టాక్ని తన చైనా ఓనర్ బైట్ డ్యాన్స్ నుంచి బలవంతంగా ఉపసంహరించుకోవాలనే బిల్లుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఒక వేళ ఇది జరగకుంటే అమెరికాలో టిక్ టాక్ని నిషేధించవచ్చు.
అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 352 మంది అనుకూలంగా ఓట్ చేయగా.. కేవలం 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. అంతకు ముందు రోజు చైనా, అమెరికా చర్యల్ని ఖండించింది. దీనిని బెదిరింపు చర్యగా అభివర్ణించింది. అమెరికా చర్యతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన చైనీస్ యాప్కి భారీ దెబ్బ పడినట్లే. ఇప్పటికే ఈ యాప్ని భారత్ 2020లోనే నిషేధించింది. టిక్ టాక్కి అమెరికాలో 170 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.
Read Also: BRS: మరో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ఎవరంటే?
టిక్ టాక్ తన మాతృసంస్థ బైట్ డ్యాన్స్కి 180 రోజుల్లోగా యాప్ని విక్రయించాలని, ఇది జరగకపోతే Apple మరియు Google యాప్ స్టోర్ల నుండి నిషేధించబడుతుంది. ఈ కంపెనీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అధ్యక్షుడు జో బిడెన్ అధికారికంగా “ప్రొటెక్టింగ్ అమెరికన్స్ ఫ్రమ్ ఫారిన్ అడ్వర్సరీ కంట్రోల్డ్ అప్లికేషన్స్ యాక్ట్” అని పిలవబడే బిల్లుపై సంతకం చేస్తారు, ఆ తర్వాత ఇది చట్టంగా మారనుంది. టిక్ టాక్ అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారిందని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. చైనా యాజమాన్యం డేటా భద్రత, వినియోగదారుల డేటా యాక్సెస్ చేయగలదని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు టిక్ టాక్ అమెరికా జాతీయ భద్రతను ఎలా ప్రమాదంలో పడేస్తుందనే దానిపై ఆధారాలు ఇవ్వలేదని చైనా ప్రభుత్వ ప్రతినిధి వాంగ్ వెన్బిన్న అన్నారు. అమెరికన్ అధికారులు న్యాయమైన పోటీని తట్టుకోలేక బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాంగ్ ఆరోపించారు. అమెరికన్ చర్య మార్కెట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుందని, పెట్టుబడిదారులు విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని ఆయన ఆరోపించారు.