భారత్లో అమెరికా రాయబారి అయిన సెర్గియో గోర్ బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా-బంగ్లాదేశ్ సంబంధాలపై చర్చించారు.
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు జరిగాయి. భారత్లో అమెరికా రాయబారిగా, దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న సెర్గియో గోర్ శనివారం బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్తో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ పర్యటనలో చివరి రోజైన శనివారం ఢాకాలో ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
అమెరికా, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడం, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ సహకారాన్ని పెంచడంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సెర్గియో గోర్ పేర్కొన్నారు. భేటీ అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన సెర్గియో గోర్.. ‘‘బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్తో సమావేశమై అమెరికా-బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం, భాగస్వామ్యాన్ని విస్తరించడంలో ఉన్న గొప్ప అవకాశాలపై చర్చించాం. ఇది అమెరికాకు ప్రాధాన్యత కలిగిన అంశం. ఇరు దేశాలు కలిసి పనిచేస్తే వాస్తవమైన, మెరుగైన ఫలితాలను సాధించవచ్చు’’ అని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, ప్రాంతీయ సహకారం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపై ఇరు పక్షాలు చర్చించినట్లు తెలిపింది. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్, సహాయ మంత్రి షామా ఒబైద్ ఇస్లాం, ప్రధానమంత్రి విదేశాంగ వ్యవహారాల సలహాదారు హుమాయూన్ కబీర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రధాని తారిఖ్ రెహమాన్తో భేటీకి ఒక రోజు ముందు సెర్గియో గోర్ కాక్స్బజార్ను సందర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యా శరణార్థుల శిబిరం అక్కడే ఉంది. ఈ పర్యటన సందర్భంగా శరణార్థులు ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభం తీవ్రతను ఆయన ప్రస్తావించారు. రోహింగ్యా శరణార్థులకు అందిస్తున్న సహాయక కార్యక్రమాలకు అమెరికా మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘బంగ్లాదేశ్లోని అమెరికా రాయబారితో కలిసి కాక్స్బజార్లో ఉన్న రోహింగ్యా శరణార్థుల సముదాయాలను సందర్శించాను. ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థ శిబిరమైన ఇక్కడ 10 లక్షల మందికిపైగా శరణార్థులు నివసిస్తున్నారు. ఈ శిబిరానికి అమెరికా మద్దతు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా భాగస్వామ్య దేశాలు తమ సహాయాన్ని మరింత పెంచాలని కోరుతున్నాం’’ అని సెర్గియో గోర్ తెలిపారు.
రోహింగ్యా శరణార్థుల కోసం చేపడుతున్న మానవతా సహాయక కార్యక్రమాలకు అమెరికానే అతిపెద్ద అంతర్జాతీయ సహకార దేశంగా కొనసాగుతోంది. జపాన్, ఆస్ట్రేలియా, నార్వే వంటి దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఈ సహాయక కార్యక్రమాలకు మద్దతు అందిస్తోంది.
సెర్గియో గోర్ బంగ్లాదేశ్ పర్యటనలో మరో కీలక ప్రకటన కూడా వెలువడింది. బంగ్లాదేశ్కు సంబంధించి అమెరికా జారీ చేసిన ప్రయాణ హెచ్చరిక స్థాయిని తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. గురువారం ఢాకాలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఖలీలుర్ రెహమాన్తో సమావేశమైన అనంతరం సెర్గియో గోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ అంచనా వేసిందని తెలిపారు. దీంతో బంగ్లాదేశ్ ప్రయాణం గతంలో కంటే సురక్షితంగా మారిందని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎన్పీ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాషింగ్టన్ నుంచి ఆ దేశాన్ని సందర్శించిన మూడో సీనియర్ అమెరికా అధికారి సెర్గియో గోర్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి పాల్ కపూర్ 2026 మార్చిలో ఢాకాను సందర్శించారు. అనంతరం దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ మే నెలలో బంగ్లాదేశ్ పర్యటించారు. శుక్రవారం సెర్గియో గోర్ ఢాకాలో బంగ్లాదేశ్కు భారత హైకమిషనర్ దినేష్ త్రివేదీతో కూడా సమావేశమయ్యారు. దక్షిణాసియా, బంగాళాఖాత ప్రాంతంలో దౌత్య కార్యకలాపాలు పెరుగుతున్న సమయంలో ఈ భేటీపై ప్రత్యేక దృష్టి నెలకొంది. బంగ్లాదేశ్తో సంబంధాలను బలోపేతం చేయడంపై అమెరికా దృష్టి సారించడంతో పాటు దక్షిణాసియా ప్రాంతంలో తన భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు వాషింగ్టన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
Today I called on the Honorable Prime Minister @trahmanbnp to discuss the great opportunities between the U.S. and Bangladesh to strengthen economic cooperation and enhance our partnership. This is a priority for the United States, and working together we can achieve real… pic.twitter.com/9DnO53A2Fc
— Ambassador Sergio Gor (@USAmbIndia) August 1, 2026
Today I visited Rohingya refugee communities in Cox’s Bazar with @USAmbBangladesh. This is the largest refugee camp in the world hosting over one million refugees. The United States has supported this camp and urges our partners around the world to increase their contributions. pic.twitter.com/Lvy2nm1lZA
— Ambassador Sergio Gor (@USAmbIndia) July 31, 2026
This evening I informed Foreign Minister Khalilur Rahman that the State Department has taken into consideration the stable conditions on the ground, and has deemed that Bangladesh is safer for travels. Accordingly, the United States overall travel advisory has been downgraded… pic.twitter.com/9dvnxIS405
— Ambassador Sergio Gor (@USAmbIndia) July 30, 2026
It was great to meet Foreign Minister Khalil Rahman during my first visit to Bangladesh and discuss working together to strengthen the U.S.-Bangladesh relationship. Lots of positive developments. pic.twitter.com/kLpiQ6QhJF
— Ambassador Sergio Gor (@USAmbIndia) July 30, 2026

