ఓ అమెరికా అధికారి కండకావరానికి తెలుగు బిడ్డ అర్ధాంతరంగా తనువు చాలించింది. 23 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఓ కన్నపేగు తల్లడిల్లింది. న్యాయం కోసం ఈ గుండె ఘోషించింది. చివరికి బాధితురాలి పక్షాన్నే న్యాయదేవత నిలిచింది. అగ్ర రాజ్యంలో ఓ తెలుగు బిడ్డ ఘన విజయం సాధించింది.
జాహ్నవి కందుల(23).. భారతీయ విద్యార్థిని. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వాసి. అమెరికాలోని సియాటిల్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. 2023, జనవరిలో రోడ్డు దాటుతుండగా సియాటిల్లోని ఆఫీసర్ కెవిన్ డేవ్ కారు ఢీకొట్టింది. 119 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది.
అయితే కారుతో ఢీకొట్టిన తర్వాత అధికారి చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. కండకావరమో.. లేదంటే గర్వమో తెలియదు గానీ.. పశ్చాత్తాపం లేకుండా అమానుషంగా మాట్లాడాడు. ‘‘ఆమె చనిపోయింది. ఆమె చాలా మామూలు మనిషి. 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ..’’ అంటూ వెకిలి నవ్వుతూ అపహాస్యం చేశాడు. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు మరో అధికారి బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ మాటలు భారతీయుల హృదయాలను కదిలించేశాయి. ఇంత దుర్మార్గమా? అంటూ న్యాయపోరాటానికి దిగారు.
ఇక ఈ కేసులో గత శుక్రవారం కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఇరుపక్షాలు పరిష్కార నోటీసు దాఖలు చేశాయి. బాధిత కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించేందుకు సియాటిల్ నగరం ఒప్పందం చేసుకుంది.
తాజాగా ఈ కేసులో సియాటిల్ నగర న్యాయవాది ఎరికా ఎవాన్స్ కీలక ప్రకటన వెలువరించారు. కందుల జాహ్నవి మృతిపై విచారం వ్యక్తం చేస్తూ నష్ట పరిహారంగా సియాటిల్ నగరం 29 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 262 కోట్లు) చెల్లిస్తామని ప్రకటించారు. ‘‘జాహ్నవి కందుల మరణం హృదయ విదారకమైనది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ప్రశాంతతను తెస్తుందని నగరం ఆశిస్తోంది.’’ అని ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘జాహ్నవి కందుల జీవితం ముఖ్యమైనది. ఇది ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు, మా సమాజానికి ముఖ్యమైనది..’’ అని పేర్కొన్నారు. మొత్తానికి రెండేళ్ల తర్వాత ఓ తెలుగు బిడ్డ ఘన విజయం సాధించింది.
