ఉక్రెయిన్ దేశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర శంఖం పూరించి 100 రోజులు గడుస్తోంది. అయినా.. చిన్న దేశమైన ఉక్రెయిన్పై రష్యా పట్టు సాధించలేక పోతోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతుండడంతో.. ఇప్పటికీ రష్యా ఆధీనంలో వెళ్లి ప్రాంతాల్లో పట్టు సడలుతోంది. ఉక్రెయిన్ క్రమంగా పట్టు బిగిస్తుండడంతో.. రష్యా సైనికులు తోక మూడవక తప్పడం లేదు.
రష్యా సైనికులను నష్టపోతున్నా.. తిరిగి వారిని భర్తీ చేయడంలో విఫలమవడంతో.. తూర్పు ఉక్రెయిన్పై రష్యా పట్టుకోల్పోయింది. ఈ నేపథ్యంలోనే యూకే రక్షణ మంత్రిత్వశాఖ ట్విట్టర్ వేదికగా.. రష్యా ఎత్తుగడలు సాగడం లేదని ట్వీట్ చేసింది. అయితే.. తాజాగా ఉక్రెయిన్ ఓ ప్రకటన చేసింది.
యుద్ధం ప్రారంభం నుండి రష్యా సైన్యం క్రమంగా బలహీనపడుతోందని, ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన తర్వాతి నుంచి ఇప్పటి వరకు రష్యా తన సైన్యంలో మూడింట ఒకవంతు నష్టాన్ని చవిచూసింది. ఫలితంగా ఉక్రెయిన్లో రష్యా బలగాల శక్తిసామర్థ్యాలు క్రమేణా క్షీణిస్తున్నాయని ఉక్రెయిన్ తెలిపింది.
అనుకున్న ప్రకారం కార్యకలాపాలు ముందుకు సాగకపోవడంతో రష్యా సైనికులు లొంగిపోతున్నారని పేర్కొన్న ఉక్రెయిన్.. వచ్చే నెల రోజుల్లోనూ రష్యా పరిస్థితి ఇంతేనని, ఆక్రమణ చర్యలను రష్యా వేగవంతం చేసే పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు కూడా రష్యా సైనికులపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది.
దీంతో పాటు.. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు వాదిమ్ డెనిసెంకో తమ దేశ సైన్యం ఖార్కివ్ ప్రాంతంలోని రష్యా సరిహద్దుల వరకు వెళ్లిందని తెలిపారు. ఉక్రెయిన్ రక్షణ శాఖ కూడా ఫేస్బుక్లో ఇలాంటి పోస్టే పెట్టింది. ఉక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్ 127 బ్రిగేడ్ బెటాలియన్ రష్యా సరిహద్దుకు చేరుకుందని, తాము విజయానికి చేరువలో ఉన్నామని ఆ పోస్టులో పేర్కొంది.
ఆస్ట్రియా మాజీ రాయబారి అలెగ్జాండర్ చెర్బా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ఉక్రెయిన్ సైన్యం రష్యా సరిహద్దుకు చేరుకున్నట్టుగా ఉంది. ఆ వీడియోలో సైనికులు మాట్లాడుతూ.. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. శత్రుదేశ సరిహద్దులకు వచ్చేశాం’ అని ఉంది.
