NTV Telugu Site icon

UK: యూకే ఎన్నికల్లో మహిళల సరికొత్త రికార్డ్

Womens

Womens

స్త్రీలు గౌరవింపబడినప్పుడే దేశం బాగుంటుందని పెద్దలు అంటుంటారు. అక్షరాల అది నిజం చేశారు లండన్ ప్రజలు. శుక్రవారం వెలువడిన యూకే ఎన్నికల ఫలితాల్లో నారీమణులు అత్యధిక స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. తాజా ఫలితాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పారు.

యూకేలో శుక్రవారం వెలువడిన ఫలితాల్లో లేబర్ పార్టీ విజయం సాధించి కీర్ స్టార్మర్ ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఫలితాల్లో మహిళా అభ్యర్థులు అనేక ముఖ్యమైన మైలురాళ్లను సాధించారు. రాజకీయాల్లో కొత్త పుంతలు తొక్కారు. జూలై 4న దాదాపు 242 మంది మహిళలు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. ఇది ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో పార్లమెంటుకు ఎన్నికైన వారిగా రికార్డు సృష్టించారు. గతంలో 2019లో 220 మంది మహిళలు ఎన్నికై రికార్డు సృష్టించారు. తాజాగా ఆ రికార్డ్‌ను నారీమణులు మళ్లీ బద్ధలుకొట్టారు.

2017లో రికార్డు స్థాయిలో 207 మంది మహిళలు ఎన్నిక కాగా.. 2015లో 196 మంది మహిళలు ఎంపికయ్యారు. ప్రతి ఎన్నికల్లో పార్లమెంట్‌లో మహిళల సంఖ్య పెరుగుతోంది. మహిళలకు మంచి అవకాశాలు, ప్రోత్సాహం లభించడం ద్వారా చట్టాన్ని రూపొందించడంలో నారీమణులు పాత్ర పోషిస్తున్నారు.

ఇక రాచెల్ రీవ్స్.. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో ఖజానా ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. యూకే ఆర్థిక మంత్రిగా ఎన్నుకోబడిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే మరో మహిళ ఏంజెలా రేనర్‌ బ్రిటన్‌ కొత్త ఉప ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇలా అన్నింటిలో మహిళలు దూసుకుపోతున్నారు.

అలాగే తమిళనాడు సంతతికి చెందిన ఉమా కుమారన్ కూడా చరిత్ర సృష్టించారు. ఈమె కూడా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఉమా కుమారన్‌ను తమిళనాడు ప్రభుత్వం అభినందించింది. మొదటిసారిగా సిక్కు సంఘం నుంచి కూడా 11 మంది సభ్యులు యూకే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.