ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. బహుశా రెండు వారాల్లో.. లేదంటే చాలా త్వరగా ఇరాన్తో యుద్ధం ముగించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. వైట్హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమించబోతుందని స్పష్టం చేశారు. యుద్ధం ముగించడానికి టెహ్రాన్తో దౌత్య ఒప్పందం అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇరాన్తో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు.. అలాగే మాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం వాళ్లకు లేదని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే సామర్థ్యాన్ని లేకుండా చేస్తామని.. రాతియుగంలోకి నెట్టేస్తామని పేర్కొన్నారు. అప్పుడే అక్కడ నుంచి అమెరికా నిష్క్రమిస్తుందని తెలిపారు.
ఇతర దేశాలన్నీ కూడా ఎవరికి కావాల్సిన చమురు వాళ్లే తెచ్చుకోవాలన్నారు. ఇకపై అమెరికా సహాయం చేయదని స్పష్టం చేశారు. ఫ్రాన్స్, చైనా వంటి దేశాలు స్వయంగా తమ నౌకలను పంపుకుని చమురు తెచ్చుకోవాలని ట్రంప్ సూచించారు.
అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని టెహ్రాన్ అంగీకరించకపోతే సైనిక చర్యలను తీవ్రతరం చేయవచ్చని వాషింగ్టన్ గతంలోనే హెచ్చరించింది. ఈ ఒప్పందంలోని కీలక డిమాండ్లలో అణ్వాయుధాలను సమకూర్చుకోబోమని ఇరాన్ హామీ ఇవ్వడం, యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయడం, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడం వంటివి ఉన్నాయి. కానీ తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ఒప్పందాలు ఉండవని.. త్వరలోనే యుద్ధం ముగిస్తామని ప్రకటించారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే కొన్ని రోజులు యుద్ధం కీలకమన్నారు. అవసరమైతే భూతల దాడుల వినియోగాన్ని కూడా తిరస్కరించలేమని తెలిపారు. మంగళవారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ..యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్తో ఒప్పందం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ సుముఖంగా ఉన్నారని తెలిపారు. అయితే ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఏప్రిల్ 1 నుంచి అమెరికాలోని ప్రధాన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రకటనలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్తో సహా 18 కంపెనీల పేర్లను పేర్కొంటూ వాటి ప్రాంతీయ కార్యకలాపాలు దెబ్బతినవచ్చని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా యుద్ధాన్ని ముగించడంపై టెహ్రాన్ తన వైఖరిని కఠినతరం చేస్తున్న తరుణంలో అమెరికా నుంచి ఇలాంటి సందేశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్ జజీరాతో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ.. అమెరికా నుంచి ప్రత్యక్ష సందేశాలు అందుతున్నప్పటికీ అవి చర్చల స్థాయికి చేరవని స్పష్టం చేశారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్తో మాత్రం తరచుగా పరోక్షంగానే సంభాషణలు జరిగాయని అరాఘ్చి వెల్లడించారు.
