Trump-Netanyahu: ‘‘బీబీ నీపై విసుగొచ్చింది’’.. వెలుగులోకి ట్రంప్-నెతన్యాహు సంభాషణ

  • ‘‘బీబీ నీపై విసుగొచ్చింది’’
  • గాజా ఒప్పందంపై నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం
  • వెలుగులోకి ట్రంప్-నెతన్యాహు సంభాషణ
Trump Netanyahu

Trump Netanyahu

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య గాజా యుద్ధం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని ఓ కొత్త పుస్తకం వెల్లడించింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై జరిగిన ఫోన్ సంభాషణలో ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ది న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు మాగీ హాబెర్మన్, జోనాథన్ స్వాన్ రచించిన “Regime Change: Inside The Imperial Presidency Of Donald Trump” పుస్తకంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గాజా యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపిస్తూ.. అమెరికా మద్దతుతో రూపొందించిన కాల్పుల విరమణ ప్రణాళికకు అడ్డంకులు సృష్టించవద్దని నెతన్యాహును ట్రంప్ హెచ్చరించినట్లు రచయితలు పేర్కొన్నారు.

2025 సెప్టెంబర్‌లో జరిగినట్లు చెప్పబడుతున్న ఆ ఫోన్ కాల్‌లో ట్రంప్.. “బీబీ (నెతన్యాహు), అందరికీ నీపై విసుగొచ్చింది. యూదులకు కూడా విసుగొచ్చింది. ఈ కాల్‌లో ఉన్న ఇద్దరు యూదులకు కూడా నీపై విసుగొచ్చింది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. ఆ కాల్‌లో ట్రంప్‌తో పాటు ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్, మధ్యప్రాచ్య ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. గాజా యుద్ధాన్ని ముగించి.. ఆ ప్రాంత పునర్నిర్మాణానికి మార్గం సుగమం చేసే 20 అంశాల శాంతి ప్రణాళిక నుంచి నెతన్యాహు వెనక్కి తగ్గే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు పుస్తకం చెబుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్.. “ఈ ఒప్పందానికి అంగీకరించు. ఈ యుద్ధం చాలా కాలంగా సాగుతోంది” అంటూ నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు.

×
×
Ad

గాజా కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్న సమయంలో ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించడం అమెరికా అధికారుల్లో అసంతృప్తిని పెంచినట్లు పుస్తకం వెల్లడించింది. ఆ దాడికి ముందు నెతన్యాహు సలహాదారు రాన్ డెర్మర్‌తో కుష్నర్, విట్‌కాఫ్ సమావేశమై గాజా యుద్ధానంతర పరిస్థితులపై చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే అనంతరం జరిగిన దాడితో ఇజ్రాయెల్ తమ ఉద్దేశాల గురించి పూర్తి సమాచారం ఇవ్వలేదనే భావన అమెరికా వర్గాల్లో ఏర్పడినట్లు రచయితలు తెలిపారు. ఈ ఘటనతో ఖతార్ కూడా కాల్పుల విరమణ మధ్యవర్తిత్వ చర్చల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు.

చివరికి ఒప్పుకున్న నెతన్యాహు

అయితే తీవ్ర విభేదాల అనంతరం కుష్నర్, విట్‌కాఫ్ రూపొందించిన కాల్పుల విరమణ ప్రణాళికకు నెతన్యాహు చివరికి అంగీకరించినట్లు పుస్తకం వెల్లడించింది. దోహా దాడి జరిగిన 18 రోజుల తర్వాత ఆయన ఆ ప్రణాళికకు మద్దతు తెలిపారని, అనంతరం క్షమాపణ కూడా చెప్పినట్లు రచయితలు పేర్కొన్నారు. ఈ పుస్తకం గాజా యుద్ధ సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల వెనుక జరిగిన అంతర్గత విభేదాలను వెలుగులోకి తీసుకువచ్చింది. బహిరంగంగా సన్నిహిత మిత్రదేశాలుగా కనిపించినప్పటికీ.. గాజా యుద్ధం, కాల్పుల విరమణ చర్చలు, మధ్యప్రాచ్య శాంతి ప్రయత్నాల విషయంలో ట్రంప్-నెతన్యాహు మధ్య తీవ్రమైన విభేదాలు చోటుచేసుకున్నాయని ఈ వివరాలు సూచిస్తున్నాయి.