గత కొద్ది రోజులుగా ఇరాన్-అమెరికా మధ్య జరుగుతోన్న శాంతి ఒప్పందంపై ఈరోజు ఏదోకటి తేలిపోయే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇరాన్తో జరుగుతున్న కీలక ఒప్పందంపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో సమావేశమై “ఫైనల్ డిటర్మినేషన్” చేయబోతున్నట్లు తెలిపారు.
ఇరాన్తో కుదిరే ఏ ఒప్పందమైనా కొన్ని కీలక షరతులపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోదని హామీ ఇవ్వాలని.. అలాగే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తక్షణమే పూర్తిగా తెరవాలని డిమాండ్ చేశారు. “హోర్ముజ్ జలసంధి వెంటనే తెరవాలి. ఎటువంటి టోల్లు లేకుండా రెండు దిశల్లోనూ వాణిజ్య నౌకలకు స్వేచ్ఛగా రాకపోకలు ఉండాలి” అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఆ జలసంధిలో మిగిలి ఉన్న నావికాదళ మైన్స్ను ఇరాన్ తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు ఇరాన్ పోర్టుల చుట్టూ అమలు చేసిన అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా ఎత్తివేస్తామని వెల్లడించారు.
“దిగ్బంధనం వల్ల అక్కడ చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు తమ దేశాలకు తిరిగి వెళ్లవచ్చు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనదైన శైలిలో “మీ భార్యలు, భర్తలు, కుటుంబ సభ్యులకు నా తరఫున హలో చెప్పండి” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇరాన్ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వల విషయంపైనా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడుల తర్వాత భూగర్భంలో పాతిపడిపోయినట్లు భావిస్తున్న ఆ యురేనియంను అమెరికా, ఇరాన్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) సమన్వయంతో వెలికి తీసి పూర్తిగా ధ్వంసం చేస్తామని తెలిపారు. “11 నెలల క్రితం మా B2 బాంబర్ దాడుల తర్వాత పర్వతాల కింద పాతిపడిపోయిన న్యూక్లియర్ డస్ట్ను అమెరికా.. ఇరాన్, IAEAతో కలిసి వెలికి తీసి నాశనం చేస్తుంది” అని ట్రంప్ పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ ఒప్పందం కింద ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగవని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే పలు అంశాలపై ఇరాన్తో అవగాహన కుదిరినట్లు కూడా సంకేతాలు ఇచ్చారు. మొత్తానికి ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి, యురేనియం నిల్వల అంశాలపై అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ట్రంప్ నేడు తీసుకోబోయే తుది నిర్ణయం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
