Site icon NTV Telugu

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు పదవీగండం..

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ముగిపోవడంతో.. ఆయనకు పదవీ గండం తప్పేలా లేదు. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 25 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నారు. ఈ నెలాఖరులో.. ఇమ్రాన్‌ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే అక్కడి ప్రజలు ఆయన పాలన పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ దేశంలో ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని.. దేశంలో నిత్యవసరాల ధరలు, నిరుద్యోగం పెరిగి పోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: Ukraine Russia War: రష్యా దాడుల్లో హీరోయిన్‌ మృతి..

అయితే, అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ నెగ్గడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ పార్లమెంట్‌లో.. 172 మంది ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక సైన్యంకూడా ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం ఆస్ట్రేలియాతో పాకిస్థాన్‌ క్రికెట్‌ సిరీస్‌పైనా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇంకోవైపు… ఈ నెల 29 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు బస చేసే హోటల్‌కు సమీపంలోనే ఆ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో సిరీస్‌ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యకమౌతున్నాయి. అయితే, ఆస్ట్రేలియాతో సిరీస్‌ వేదికను ఇస్లామాబాద్‌ నుంచి లాహోర్‌కు మార్చే ఆలోచనలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు-పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version