వాళ్లంతే..! గతంలో చెప్పింది ఒక్కటి.. ఇప్పుడు చేసేది మరొకటి… గట్టిగా వారిని నిలదీసే పరిస్థితి కూడా ఉండదు.. ఇప్పటికే వారు ఎవరో అర్థమైపోయిఉంటుండొచ్చు.. వారే.. తాలిబన్లు.. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత కొత్త కొత్త రూల్స్ తెరపైకి వస్తూనే ఉన్నాయి.. ఇటీవలే అమ్మాయిలకు హైస్కూల్ తలుపులు తెరిచినట్లే తెరిచి, మూసేసిన తాలిబన్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో కఠిన నిర్ణయం అమలు చేసేందుకు సిద్ధమైంది… అందులో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగులంతా గడ్డం పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, విదేశీ వస్త్రాలు ధరించొద్దని, స్థానికంగా ఉండే దుస్తులు మాత్రమే వేసుకోవాలని స్పష్టం చేసింది. దేశీయంగా దొరికే పొడవాటి లూజు చొక్కా, ప్యాంటు వేసుకొని, గడ్డం పెంచుకొని, తలపై టోపీ లేదా తలపాగా పెట్టుకోవాలంటూ పబ్లిక్ మోరాలిటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
Read Also: Gangster Nayeem: నయీమ్ కేసులో కీలక మలుపు..
తాలిబన్లు అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత వింత నిర్ణయాలు తీసుకుంటున్నారు.. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.. ముఖ్యంగా బాలికలు, అమ్మాయిలు, మహిళలపై వారి ప్రతాపాన్ని చూపుతున్నారు.. అయితే, తాజాగే ప్రభుత్వ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించిన తాలిబన్ ప్రతినిధులు.. గడ్డం పెంచుకోని ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారట.. ఇకపై ఎవరూ షేవింగ్ చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు.. తాము విధించిన రూల్స్ ఎవరైనా సరే పాటించకపోతే వారిని ఆఫీసుల్లోకి రానివ్వబోమని స్పష్టం చేశారు.. స్పష్టమైన ఆదేశాలు ఉన్నా తప్పును రిపీట్ చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది తాలిబన్ సర్కార్.